15 రోజుల్లో మళ్లీ ‘గ్యాస్’ బాదుడు

ఓవైపు పెట్రోల్, నిత్యావసరాల ధరలు మోత మోగు తున్న వేళ రాయితీ గ్యాస్ సిలిండర్ ధరపై చమురు సంస్థలు మరోసారి వడ్డించాయి. దీంతో వంటింట్లో గ్యాస్ బండ సామాన్యుల గుండెల్లో గుదిబండలా మారుతోంది. 15 రోజుల వ్యవధిలో సిలిండర్ ధర పెరగడం ఇది రెండో సారి కావడం గమనార్హం. డిసెంబరు 2వ తేదీన ఒక్కో గ్యాస్ సిలిండర్పై రూ. 50 పెంచిన చమురు సంస్థలు.. మంగళవారం మరో రూ. 50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉత్తర్వుల్లో పేర్కొంది. వినియోగదారులకు రాయితీగా అందించే ఒక్కో గ్యాస్ సిలిండర్పై రూ. 50 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నేడు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపుతో దేశ రాజధానిలో ప్రస్తుతం రూ. 644గా ఉన్న 14.2 కిలోల సబ్సిడీ సిలిండర్ ధర రూ. 694కు పెరిగింది. మిగిలిన ప్రాంతాల్లోనూ ఆ మేరకు గ్యాస్ ధర మోత మోగనుంది. ఇక 5 కేజీల సిలిండర్పై రూ.18.. 19 కేజీల సిలిండర్పై రూ.36.50 పెంచినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. పెరిగిన ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చినట్లు చమురు సంస్థలు తెలిపాయి.