‘అనంత’ ఆకలితీరుస్తున్న జొన్నరొట్టె!
- 135 Views
- wadminw
- September 3, 2016
- రాష్ట్రీయం
* కరువుసీమను చౌకధరలో ఆదుకుంటున్న ఆహారం
అనంతపురం: అనంత వాసుల ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ జంక్ ఫుడ్స్పై మోజు చూపిన జనం ఇప్పుడు సంప్రదాయిక ఆహారం వైపు మొగ్గు చూపుతున్నారు. సీమ వంటకాల్లో ప్రసిద్ధమైన రాగిముద్దతో పాటు ఇప్పుడు జొన్న రొట్టెలనూ అమితానందంతో తింటున్నారు. మొన్నటి వరకూ జంక్ఫుడ్ సెంటర్లతో నిండిన అనంత వీధులు ఇప్పుడు జొన్నరొట్టె కేంద్రాలతో కళకళలాడుతున్నాయి. ఆకలిని తీర్చడంతో పాటు ఆరోగ్యానికీ మేలు చేస్తుండడంతో ప్రజలిప్పుడు జొన్నరొట్టెలను ఆబగా ఆరగించేస్తున్నారు.
మారుతున్న ఆహారపుటలవాట్లు సంప్రదాయిక రొట్టెలపై పెరుగుతున్న మోజు అవును అనంతపురం జిల్లా వాసులిప్పుడు సంప్రదాయిక వంటలను అమిత ప్రేమతో ఆరగించేస్తున్నారు. రాత్రయితే చాలు అనంతపురం జిల్లాలో జొన్నరొట్టెల షాపులు కళకళలాడిపోతున్నాయి. విదేశీ ఆహారానికి ముఖ్యంగా జంక్ఫుడ్స్కు అలవాటు పడ్డంతో ప్రజలు ఇటీవల షుగర్, బీపీ, కొలెస్టరాల్ పెరుగుదల వంటి రోగాలబారిన పడుతున్నారు. జంక్ ఫుడ్ వల్ల జేబుకు చిల్లు పడ్డమే కాకుండా ఆరోగ్యమూ చెడిపోతుండడంతో ప్రజల్లో క్రమంగా మార్పు వస్తోంది. దీంతో మళ్లీ సంప్రదాయిక వంటలవైపు మొగ్గు చూపుతున్నారు అనంతవాసులు. అనంతపురం రోడ్ల ప్రక్కన ఒకప్పుడు బజ్జీ సెంటర్లు స్వీట్ బండ్లు ఎక్కువగా ఉండేవి.
వీటికి తోడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు చాట్ బండార్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఓదశలో చాట్ తినడం యూత్ లో ఫ్యాషన్గా మారిపోయింది. కానీ ఇప్పుడు ట్రెండ్ మళ్లీ మారుతోంది. కొంతకాలంగా ప్రజలను జొన్నరొట్టెలు కట్టిపడేస్తున్నాయి. ఒక్కచుక్క నూనె కూడా కలపకుండా కేవలం వేడి నీళ్లతోనే తయారుచేసే జొన్నరొట్టెలు ఆరోగ్యానికి చాలా మంచివంటున్నారు స్థానికులు. రోడ్లపై అందంగా ఆకర్షించే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తయారయ్యే ఫుడ్ శరీరంలో అధికకొవ్వును ఏర్పడేలా చేస్తుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఉద్యోగాలు చేసి రాత్రుళ్లు అలసివస్తున్న వారికి వండుకునే ఓపిక లేక ఫాస్ట్ ఫుడ్స్నే ఆశ్రయించేవారు. ఇప్పుడు వాటి స్థానాన్ని జొన్నరొట్టెలు ఆక్రమించేశాయి.
ఫాస్ట్ ఫుడ్ కంటే తక్కువ ధరలో అంటే పది రూపాయలకే ఓ జొన్న రొట్టె లభిస్తుండడంతో అనంత వాసులు ఇప్పుడు ఈ ఆహారానికే ఓటేస్తున్నారు. అనంతపురంలోని కరువు, పేదకరికం కారణంగా పలువురు పెద్ద నగరాలకు వలసపోతున్నారు. మిగిలిన వాళ్లు నగరంలో ఏదో ఒకపని చేసుకుంటూ బతుకుతున్నారు. ఇలాంటి వారికి జొన్నరెట్టెల బండ్లు ఫైవ్ స్టార్ హోటళ్లవుతున్నాయి. కేవలం 20 రూపాయలు వెచ్చించి రెండు రొట్టెలు తిని కడుపు నింపుకుంటున్నారు. దీంతో ఇప్పుడు జొన్నరొట్టెల తయారీ కేంద్రాలు పెరిగిపోయాయి.
తద్వారా మరికొందరికి ఉపాధీ లభిస్తోంది. ఫాస్ట్ ఫుడ్ ప్రాణాలను హరించి వేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో చాట్ బండార్లలో వాడే ఆయిల్ మళ్లీమళ్లీ వాడడంతో అవి విషతుల్యం అవుతున్నాయి. దీంతో చాలా మందికి బ్లడ్ షుగర్, బీపీ, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయి. అయితే నూనె లేకపోవడం షుగర్ను కంట్రోల్ చేసే పోషకాలు ఉండడం బీపీనీ నియంత్రింస్తుండడం వల్ల జొన్నరొట్టెలు పరిపూర్ణ ఆరోగ్యాహారమని వైద్యులు చెబుతున్నారు. రాగిముద్దలు, జొన్నరొట్టెలు తీసుకోవడం వల్ల సుదీర్ఘ కాలం పాటు ఆకలి కాదని, అదే సమయంలో ఆరోగ్యాన్నీ మెరుగు పరుస్తుందనీ అంటున్నారు. జొన్నరొట్టె తయారీ చేయడానికి చాలా నైపుణ్యం కావాలి.
జొన్నపిండికి వేడినీటిని కలిపి ముద్దగా చేసుకుని చేతితో దాన్ని తట్టుతూ వెడల్పు చేయడం ఎంతో అలవాటున్న వారికే తప్ప నేటి తరం యువతీయువకులకు దాదాపు తెలియదు. దీంతో జొన్న రొట్టెల విక్రయ కేంద్రాల పుణ్యమా అని సంప్రదాయిక వంటకాలను మళ్లీ భుజించగలుగుతున్నామని నేటి యువత చెబుతున్నారు. మొత్తానికి అనంతలో వెలసిన జొన్నరొట్టెల కేంద్రాలు ప్రజలకు ఆరోగ్యకర ఆహారాన్నీ కొంతమందికి ఉపాధినీ అందిస్తున్నాయి.


