ఆయన లేనప్పుడు జయకు గుండెపోటు?
అమ్మ మరణంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్న వేళ… కోర్టును ఆశ్రయిస్తున్న సందర్భంలో ఆసక్తికరమైన అంశం ఒకటి తెరమీదకు వచ్చింది. అది కూఆ అపోలో చైర్మన్ స్వయంగా తనకు తానుగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పటం గమనార్హం. సదరు మీడియా సంస్థ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే క్రమంలో అపోలో చైర్మన్ ప్రతాప్రెడ్డి చెప్పిన మాటల్లోని కొన్నింటిని ఒకటిగా చేరిస్తే పలు సందేహాలు వచ్చేలా ఉండడం గమనార్హం. ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా జయలలితకు తాము చేసిన చికిత్స గురించి వివరంగా చెప్పుకొచ్చారు. అపోలో ఆసుపత్రిని స్టార్ట్ చేయక ముందు, తాన హెచ్ఎం ఆసుపత్రిలో పనిచేస్తున్న సమయంలో జయలలితఒకసారి చికిత్స కోసం తన వద్దకు వచ్చిన విషయాన్ని ప్రతాప్రెడ్డి గుర్తు చేసుకున్నారు. అస్వస్థతతో ఉన్నా ఆమె ముఖంలో మాత్రం చిరునవ్వు కనిపించేదని చెప్పారు.
ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు కూడా తాను పలుమార్లు అమ్మను కలిసినట్లుగా చెప్పారు. సెప్టెంబర్ 22న అపోలో ఆసుపత్రిలో చేరిప్పటి నుంచి తాను దగ్గర ఉండి మరీ చికిత్సను పరిశీలించానని చెప్పారు. అమ్మ ఆసుపత్రిలో ఉన్న రెండు నెలలు తాను చెన్నై నగరాన్ని వదిలిపెట్టి వెళ్లలేదన్నారు. తమ శక్తికి మించి చేయాల్సిన చికిత్సలన్నింటిని ఆమెకు అందించామని, జయలలిత మృతి చెందడానికి కొన్ని రోజులు ముందు అత్యవసర పనుల మీద హైదరాబాద్కు వెళ్లాల్సి వచ్చిందన్నారు.
తన ప్రయాణానికి ముందు ఆమెను పలుకరించానని, అప్పుడు కూడా ఆమె ముఖం మీద అదే నవ్వు కనిపించిందని, ఆ సమయంలో ఆమె టీవీ చూస్తున్నారన్నారు. ఆమె దగ్గరకు తాను వెళ్లి.. హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చేలోపు మీరు నడుస్తారని ఆమెకు చెప్పానని, తాను నగరానికి వచ్చిన తర్వాత డిశ్చార్జ్ చేద్దామని అనుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చాక ఆమెకు గుండెపోటు వచ్చిందని తెలియగానే తాను దిగ్భ్రాంతికి గురైనట్లు అపోలో చైర్మన్ చెప్పారు.
ఆమెకు గుండెపోటు రావటంతో తాను వేతన చెందానని, అప్పటివరకు ఆమెకు గుండెపోటు వచ్చేందుకు ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదన్న ఆయన, గుండెపోటు వచ్చిన వెంటనే ప్రత్యేక వైద్యనిపుణుల బృందం రంగంలోకి దిగిందన్నారు. గోల్డెన్ అవర్గా పరిగణించే టైంలో అమ్మకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్య చికిత్సలు చేపట్టామని, ఆమెకు చికిత్స చేస్తున్న గదికి సమీపంలోనే ఎక్మో విభాగపు గది ఉందని, వెంటనే ఆ పరికరాన్ని ఆమెకు అమర్చినట్లు చెప్పారు.
ఈ చికిత్స చేసుకున్న పలువురు ప్రాణగండం నుంచి బయటపడ్డారని, దురదృష్టవశాత్తు అమ్మ విషయంలో మాత్రం అది సాధ్యం కాలేదన్న విషయాన్ని అపోలో చైర్మన్ చెప్పుకొచ్చారు. ఈ మొత్తం విషయంలో కాస్త అండర్లైన్ చేసుకోవాల్సిన లైన్ ఏదైనా ఉందంటే.. అపోలో చైర్మన్ హైదరాబాద్కు వెళ్లి వచ్చే లోపే గుండెపోటు రావడం. అమ్మ మరణంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్న వేళ.. అపోలో చైర్మన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన అంశాలు ఆసక్తికరమని చెప్పక తప్పదు.


