ఆ ‘భరణీయం’
బాహ్య ప్రపంచానికి మనిషి తనను తాను ఎలా పరిచయం చేసుకునేందుకు ప్రయత్నించినా అందులో ఏదో ఒక లాజిక్ దాగి ఉంటుందన్నది చాలా మంది భ్రమ. బయటకు మనం ఎన్ని విధాలా వ్యవహరించినా, ఎవరిని అనుకరించాలనుకున్నా చివరికి మనల్ని మనం మరచిపోయే పరిస్థితి రాకూడదనే ఆశిస్తాం. అలా అనుకోకపోతే, కొన్నాళ్లకు మన జీవితం అనుకరణీయం కాకమానదు. సిద్ధాంతం ఏదైనా మన సమాజంలో కొంత మందికి నమ్మకాల పట్ల విశ్వాసం తక్కువ. కారణం ఏదైనా కావచ్చు గానీ, వాటినే మూఢ నమ్మకాలని కూడా అంటారు.
మనలో చాలా మందికి రకరకాల నమ్మకాలుంటాయి. అవి మన జీవితం అయినా సరే లేదా. మనకు వచ్చే నెల జీతం అయినా సరే… ఇలా అన్ని రకాల విషయాల్లో మనకు కొన్ని నిశ్చితమైన నమ్మకాలుంటాయి. అవి పెద్ద వాళ్ళ అనుభవాల నుండి ఏర్పడినవి కావొచ్చు లేదా మన లైఫ్లో జరిగే కొన్ని సంఘటనల ద్వారా ఏర్పడేవి అయినా కావచ్చు. ఉదాహరణకు, పెళ్లి తరువాత మొదలు పెట్టిన 2-3 వ్యాపారాల్లో నష్టం వస్తే, మన లైఫ్లోకి వచ్చిన లైఫ్ పార్టనర్ వల్ల మనకు దురదృష్టం పట్టుకుంది అన్న నమ్మకానికి వచ్చేస్తాము.
మనం రోజూ నడిపే బైక్ 1-2 సంవత్సారాల నుండి వాడుతున్నదైనా సరే, దాని నుండి కేవలం 2-3 సార్లు క్రింద పడితేనో లేక ఆక్సిడెంట్ అయితేనో చాలు, ఇక ఆ బైక్ మనకు కలిసి రాదని దాన్ని అమ్మేయడమో లేక వాడకుండా మూలకు పడేయడమో జరుగుతుంది. అంతెందుకు, వరసగా 2-3 రోజులు బాస్తో తిట్లు పడితే, ఆ 2-3 రోజులు పొద్దున్నే ఎవరి మొహం చూసామా అన్నది గుర్తు తెచ్చుకొని మరి, అది అమ్మ అయినా సరే, నాన్న అయినా సరే, చివరకు మనకు అత్యంత ఆప్తులైనా సరే, ఇక ముందు పొద్దున్నే వాళ్ళ మొహం చూడకుండా జాగర్త పడతాం.
మనం ఇలాంటి నమ్మకాలనే అభిప్రాయాలుగా భావించి వాటిని మన స్థిర అభిప్రాయాలుగా మార్చుకుంటాం. నిజం చెప్పాలంటే ఈ అభిప్రాయాలనే మూఢ నమ్మకాలుగా ఏర్పరుచుకుంటాం. మూఢ నమ్మకాలను కరెక్టుగా డిఫైన్ చెయ్యాలంటే, హేతుబద్ధత లేని నమ్మకాల్ని మూఢ నమ్మకాలు అంటారు. అంటే లాజిక్/తర్కం లేని నమ్మకాలన్నమాట. మనం లాజిక్ల కన్నా మేజిక్లనే ఎక్కువ నమ్ముతామన్న ఓ సినీ రచయిత మాటలు గుర్తొస్తున్నాయి.
మనలో చాలా కామన్గా ఉండే కొన్ని మూఢ నమ్మకాలను పరిశీలిస్తే, మనం మనుషులమేనా? అన్న అనుమానం ఒక్కో సమయంలో కలగకమానదు. కొంత మంది ఎక్కడికైనా బయలు దేరేటప్పుడు ఎవరైనా తుమ్మితే కొద్దిసేపు ఆగి, కూర్చొని వెళ్ళమంటారు. ఎందుకో ఎవరికీ తెలియదు. కానీ, పాటిస్తుంటారు. అదే విషయంలో దగ్గుకు మాత్రం అలా పాటించం, కేవలం తుమ్ముకు మాత్రమే ఈ పట్టింపు. దగ్గుని మించి తుమ్ముకు ఉన్న దురదృష్టం లేదా అదృష్టం ఏంటో అర్థం కాదు. కొందరు తెలివిగా సైన్స్ అనొచ్చు. తుమ్ముకు అంది దగ్గుకు అందని ఆ సైన్స్ ఏంటో? సైన్స్ అన్నది కామన్ సెన్స్ ఇవ్వాలి. కానీ, ఇలా నాన్సెన్స్ నమ్మకాలని కాదేమో.
మంగళవారం హెయిర్ కటింగ్ గాని, షేవింగ్ గానీ చేసుకోకూడదు అంటారు. ఎందుకో? ఎవరికీ తెలియదు. కానీ పాటిస్తారు. ఇలా హెయిర్-డూకీ, ట్యూస్-డేకీ ఉన్న ఆ అక్రమ సంబంధం ఏంటో? ఎందుకు చేయించుకోకూడదూ అని ఎవర్నైన అడిగితే వచ్చే సమాధానం ఇలా విడ్డూరంగా ఉంటుంది. చేయించుకోకూడదు కాబట్టే ఆరోజు హెయిర్ కటింగ్ షాపులు ఓపెన్ చెయ్యరు అని అంటారు. ఇది వింటే మళ్లీ ఇంకో సందేహం వస్తుంది. ఇంతకీ, ఎవరూ చేయించుకోరని షాప్ తీయరా? లేక మంగలి వారు షాప్ తీయరని ఎవరూ చేయించుకోరా? కోడి ముందా లేక గుడ్డు ముందా లాగా.
ఎడమ చేయితో డబ్బులు ఇవ్వకూడదు, తీసుకోకూడదు అంటారు. ఎందుకో ఎవరికీ తెలియదు. కానీ పాటిస్తాము. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అన్న దేవదాసు పాటను పనికి రాని పాటను చేస్తూ, కుడి, ఎడమల మధ్య ఈ ఎడం ఏంటో? ఆ పాటనైతే హిట్ చేసాం కానీ అందులో చెప్పిన మాటని పాటించం. ఆ మాటకొస్తే, ఈ ఎడమ చేయి హెల్ప్ లేకపోతే కనీసం బైకులు డ్రైవింగూ చెయ్యలేం, వెయిట్ లిఫ్టింగూ చెయ్యలేం. అంతెందుకు కనీసం ఆలికి తాళి కుడా కట్టలేం. ఒక్క ముక్కలో చెప్పాలంటే, రోజూ కాల కృత్యాలు తీర్చుకునేటప్పుడు ఈ ఎడమ చెయ్యి చేసే పని, కుడి చెయ్యి గొప్పదనానికి ఒక మెట్టు పైనే. మనం దేవుడ్ని నమ్ముతాం కానీ ఈ ఎడమ చెయ్యిని కుడా దేవుడే ఇచ్చాడన్న నిజాన్ని మరిచిపోతాం.
ఏదైనా కొత్త పని చేయాల్సి వస్తే ముహుర్తాలు పెట్టుకుంటాం. ఆ ముహూర్తాల వల్ల ఉపయోగం ఏంటో ఎవరికీ తెలియదు, అయినా పాటిస్తాం. మన పుట్టుక, చావు ఈ రెండూ ఏ ముహూర్తాలు పెట్టకుండానే జరుగుతాయి అన్న విషయాని విస్మరిస్తాం. ఇదే మాట ఎవరితోనైనా అంటే వాళ్ళు ఏమంటారో తెల్సా ? అలా పుట్టుకకు, చావుకు ముహూర్తాలు చూడ్డం కుదరట్లేదు కాబట్టే ఇలా మధ్యలో చేసే పనులకైనా ముహూర్తాలు చూస్తాం అని. ఆది, అంతానికి లేని ముహూర్తాలు, ఇలా మధ్యంతర పనులకెందుకురా మట్టి బుర్ర అని తిట్టాలనిపిస్తుంది.
కానీ, మట్టి బుర్రను మట్టి బుర్ర అంటే నోచ్చుకుంటుంది కదా? అందుకే ఊరుకుంటా. ఒక వెధవ తను వెధవ అని ఒప్పుకోడు కదా? అలాగన్నమాట. అదే లాజిక్కు. అంతెందుకు, ఇన్ని విషయాలలో ముహూర్తాలను చూసే మనిషి పుట్టుకకు నాంది అయిన సెక్స్ చేయడానికి కుడా ముహూర్తంతో పని ఉండదు మూడ్తో తప్ప. ఒకవేళ దానికి కూడా ముహూర్తం కావాలంటే, పెట్టుకోగల స్థితిలో ఉండి కూడా పెట్టుకోం, ఎందుకంటే ముహూర్తం టైంకి మూడ్ రాదు కాబట్టి. ఇంకా చెప్పాలంటే, మనం సిక్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళడానికీ, వెళ్ళాక ఒకవేళ అవసరమైతే ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా ముహూర్తాలు చూడం.
ఎందుకంటే మనకు తెలుసు, ఇలాంటి విషయాలలో ముహూర్తం చూస్తూ కూర్చుంటే పైకెళ్ళే ముహూర్తం మూడుతుందని. అన్నింటికంటే విలువైన ప్రాణం విషయంలో పట్టని ముహూర్త బలం మిగిలిన విషయాలలో మాత్రమే బలంగా పడుతుంది. ఇదో వింత. ఇక్కడ మాత్రం మేజిక్ సంతకెళ్ళి లాజిక్ ముందుకొస్తుంది. మనం ఆశావాద ఇంటెలిజెంట్సా లేక అవకాశవాద ఇంటెలిజెంట్సా అన్నది ఇక్కడ తెలుస్తుంది.
ఇలా ఉదహరిస్తూ పోతే చాలానే ఉన్నాయి. అవన్నీ రాయడానికి నాకూ, చదవడానికి మీకూ ఓపిక, టైమూ రెండూ కావాలి కదా? ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ రావొచ్చు. అదేంటంటే, నమ్మకాల గురుంచి ఇంతగా రాసినోడు, అన్నీ నమ్మకాలకు ఆది మూలమైనా దేవుడి మీద నమ్మకం గురుంచి రాయలేదేమని? అది చాలా పెద్ద సబ్జెక్టు. దాని గురుంచి రాయడానికి కొంచం ఎక్కువ టైం కావాలి మరి.
ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే, యండమూరి గారు విజయానికి అయిదు మెట్లు నవలలో చెప్పినట్టు ‘తర్కమే పాంచ జన్యం’ అంటే ‘లాజిక్ ఈజ్ లైఫ్’. నమ్మకాల పేరున లాజిక్కుల నొదిలేసి మేజిక్కుల వెనక పరుగెత్తే వాళ్లకీ, అనారోగ్యం చేస్తే డాక్టర్ల బదులు బాబాల దగ్గరికి వెళ్ళే వాళ్లకీ పెద్ద తేడా లేదని నా అభిప్రాయం.
ఇక మూఢ నమ్మకాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వివిధ దేశాల సంస్కృతులలో ప్రబలంగా ఆ నమ్మకాలన్నవి విస్తరించాయి. ప్రాచీన కాలం నుండి కొన్ని నమ్మకాలు మంచిని పెంచితే, మరికొన్ని శాస్త్రీయంగా నిరూపణ కానివిగా కనిపిస్తున్నాయి. ఈ రెండవ తరగతికి చెందిన నమ్మకాల్నే ‘మూఢ నమ్మకాలు’ అని అంటారు. ఈ మూఢ నమ్మకాలు ఎక్కువగా చదువుకోనివారిలో, గ్రామాలలోను, గిరిజన సమూహాలలో కనిపిస్తాయి.
ఒత్తిడి కారణంగా మనలో మూఢ నమ్మకాలు ప్రబలుతాయని బ్రిటన్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఈ రుగ్మత వల్ల ఆచార వ్యవహారాలపై నమ్మకం పెరుగుతుంది. ఫలితంగా అవాస్తవమైన అంశాలు కూడా నిజంగానే ఉన్నట్లుగానే భ్రమపడతారని పరిశోధకులు తెలిపారు. బ్రిటన్లోని నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆడమ్ గాలిన్స్కీ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ఈ అంశంపై పరిశోధనలు సాగించారు. జీవితం మీద అదుపు లేనట్లు భావిస్తే వారు ప్రపంచంపైన కొన్ని అభిప్రాయాల్ని రుద్దుతారని ఈ బృందం తేల్చింది.
తమ జీవితాల మీద నియంత్రణ కోల్పోయే కొద్దీ ‘మానసిక జిమ్నాస్టిక్స్’ ద్వారా దాన్ని పొందేందుకు వారు అంత ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు’ అని ఆడమ్ వివరించారు. నియంత్రణ అనేది ప్రజలకు చాలా ముఖ్యమని తెలిపారు. ఇది లేకపోవడాన్ని వారు ముప్పుగా పరిగణిస్తారని చెప్పారు. దీన్ని దూరం చేసుకొనేందుకు అపోహలను పెంచుకొని ఆత్మ సంతృప్తి పొందుతారని పేర్కొన్నారు. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు కొంతమంది వాలంటీర్లను ఎంచుకున్నారు. వీరిలో సగం మందిని నియంత్రణ కోల్పోయిన సందర్భాన్ని (కారు ప్రమాదం, సమీప బంధువు జబ్బున పడడం వంటివి) గుర్తుకు తెచ్చుకోమన్నారు. ఆ తరువాత వారిపై అనేక ప్రయోగాలు నిర్వహించారు.
అస్పష్టంగా ఉన్న చిత్రాలను చూపి అందులో ఏమైనా బొమ్మలు కనపడుతున్నాయా? అని ప్రశ్నించారు. నిజానికి ఈ చిత్రాల్లో సగం మేర చుక్కలు, మిగతా సగంలో అస్పష్టంగా ఉన్న చిత్రాలు (కుర్చీ, పడవ, గ్రహం వంటివి) ఉన్నాయి. మసకమసకగా ఉన్న చిత్రాల్లో 95 శాతాన్ని వాలంటీర్లు గుర్తుపట్టగలిగారు. అయితే ఒత్తిడితో ఉన్న బృందం మాత్రం చుక్కల్లో కూడా చిత్రాలను చూశారు. అదృష్ట మేజోళ్లు వంటివి వీరికి ఇందులో కనిపించాయి. ఈ చుక్కల్లో వారికి భిన్నరకాలైన అంశాలు, స్టాక్ మార్కెట్లు, ముఖాలు, కుట్రలు వంటివి కనిపించాయి.
దీన్నిబట్టి నియంత్రణ కోల్పోవడం వల్ల వీరి మదిలోని భావనలను ఈ చుక్కల్లో ఊహించుకుంటున్నారు అని ఆడమ్ పేర్కొన్నారు. చదువుకున్న వారిలో కూడా మూఢనమ్మకాలు వుండడానికి చిన్న తనంలో పెద్దలు చెప్పిందే వేదంలో పిల్లలు భావించడం, శాస్త్రీయపద్ధతి అంతగా ప్రబలకపోవడం, ఆదర్శవ్యక్తులుగా వుండవలసిన శాస్త్రవేత్తలు కొంతమంది అతీంద్రియ శక్తులు కనబరచే బాబాలకు శిష్యులవడం కొన్ని కారణాలు.
తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న కొన్ని నమ్మకాలపై గతంలోనూ విస్తృతంగా చర్చ జరిగింది. గుంటూరు జిల్లా పెదకాకాని బాజీబాబా దర్గా ఉరుసులో గుర్రానికి తినిపించిన ఎంగిలి మిఠాయి భక్తులు ఎగబడి తింటారు. ఇదొక మానసిక దివాళాతనంగా నాస్తికులు భావిస్తారు. పరోపకారం కోసం తన దేహాన్నే కోసి ఇచ్చిన గొప్ప దానశీలి త్యాగమూర్తి మయూరధ్వజుడు. అతని పేరుతో నెలకొల్పిన ధ్వజస్థంభం నీడ గుడి మీదకానీ ఇళ్ళమీదకానీ పడకూడదంటారు.
బుధవారం నాడు ఆడపిల్ల పుడితే అరిష్టం అని చంపేయటమో ఎక్కడో వదిలేసి రావటమో చేసినట్లు గతంలో ప్రచారం జరిగింది. జాతర రోజులలో గ్రామశక్తి పోలేరమ్మ పట్టణంలో సంచరిస్తుంటుందని, అరిష్టం కలుగుతుందని శుభకార్యాలు చేయడం ఆపివేస్తారు. మసూచి ఆటలమ్మ లాంటి రోగాలను అమ్మవారికి ఆపాదిస్తారు. అనంతపురం జిల్లా హిందూపురం ఎస్.సడ్లపల్లిలో పిల్లలకు వచ్చిన కోరింత దగ్గు నయం కావడానికి కుక్క విగ్రహానికి పూజలు చేస్తారు. చిత్తూరు జిల్లాలొ పిల్లలకు వచ్చిన కోరింత దగ్గుకు కుక్కను వేలాడ దీసిన కానుక (గానుగ) చెట్టుకున్న కానక్కాయను తెచ్చి దానికి మధ్యలో రంధ్రం చేసిపిల్లవాని మొల త్రాడుకు కడతారు.
చేతబడి చేశారని పళ్ళు పీకడం, కిరోసిన్ పోసి నిప్పంటించడం, వివస్త్రలను చేయడం, కొట్టి చంపడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సోమాపురం గ్రామంలో చిన్న పిల్లల జబ్బులకు అక్కడి పూజారి చెక్క చెప్పు వైద్యమే మందు. అనారోగ్యంతో వచ్చే వారికి దెయ్యాలు ఆవహించాయని, వాటిని తరిమేస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని కొరడాతో బాదుతాడు. పిల్లలు లేని వారు తమ వీపుపై పూజారి పాదం పడితే పిల్లలు పుడతారని తొక్కించుకుంటారు. కొందరు గ్రహణం రోజు భోజనం చెయ్యరు, అమావాస్య నాడు పెళ్ళిచేసుకోరు. గర్బిణులు బయటకు రారు. వంటపాత్రలలో, నీటిలోగడ్డిపోచలు వేస్తారు.
గ్రహణం కారణంగా దేవాలయాల్లో అన్నిసేవలు, దర్శనాలను రద్దు చేసి ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 వరకు ఆలయం తలుపులను మూసి వేస్తారు. బయలుదేరినప్పుడు ఎవరన్నా తుమ్మితే కాసేపు కూర్చొని మంచినీళ్ళు తాగి వెళ్ళమంటారు. పరీక్షల్లో కాపీకొడుతూ దొరికిపోయినా బయలుదేరేటప్పుడు తుమ్మిన వ్యక్తిదే తప్పు అతనిది మంచితుమ్ము కాదు అంటారు. తుమ్ము రాబోయే ప్రమాదాన్ని తమ్ముడై చెబుతుంది అంటారు. తండాల్లోని గిరిజనుల్లో ఎక్కువమంది ఆడపిల్లలు గలవారు ఆడపిల్లను దానమిస్తే మగపిల్లలు పుడతారంటూ మగపిల్లవాడికోసం ఆడపిల్లను దానం చేసి వదిలించుకుంటారు.
కరీంనగర్ జిల్లాలో ఆవుకు మనిషి పుట్టాడని అందువలన కొడుకులు చస్తారని ఎంతమంది కొడుకులుంటే అన్ని దీపాలు వెలిగించారు. నాగమణి, నల్ల పసుపు కొమ్ము, ఎర్ర కలబంద, నేలగుమ్మడికాయ, నల్లపిల్లి, ఇరవైగోళ్ల తాబేలు, రెండుతలల పాము, వెదురు మణి (ఒక రకమైన పురుగు) లాంటివాటికి అద్భుత శక్తులున్నాయనే కారణంతో లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేస్తున్నారు. కొందరు కాకి తలమీద తన్నితే అది శని వాహనం కనుక శని పడుతుందనీ, యముడి రూపం కనుక మరణిస్తామని భయపడతారు.
చిత్తూరు జిల్లాలో చాలా పల్లెల్లో ప్రజలు తమకు పట్టుకొన్న శనిని వదిలించు కోడానికి (దయ్యాన్ని) ఎవరు చూడకుండ రాత్రులందు కుంకుం కలిపిన ఎర్రటి అన్నాన్ని, కొశిన నిమ్మకాయలను, బొగ్గులను మూడు దారులు కలిసే చోట వేస్తారు. దానిని తొక్కిన వారికి ఆ దెయ్యం పట్టుకుంటుందని నమ్ముతారు. బల్లి తన శరీరంపై పడితే అది పడిన ప్రదేశాన్ని బట్టి ఫలితం ఉంటుంది. కానీ బల్లి పడినవారు స్నానం చేసి కంచి ఆలయంలో వున్న బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి కాళ్లకు మొక్కితే దాని వలన కలిగే అరిష్టము కలగదని నమ్ముతారు. చిత్తూరు జిల్లాలో ఎవరైనా ప్రయాణమై బయలుదేరి వెళ్లే టప్పుడు ముండ మోపి, పిల్లి (ముఖ్యంగా నల్లపిల్లి),గొడ్రాలు,బ్రహ్మచారి, ఎదురొస్తే వెళ్ళే పని కాదని నమ్ముతారు.
అలాగే వారు వెళ్లె టప్పుడు మంగలి, చాకలి, పిచ్చిది, పిల్లల తల్లి, ముత్తైదువ, దంపతులు, ఎదురైతే మంచిదని నమ్ముతారు. భక్తరపల్లి బ్రహ్మోత్సవాలలో భూతప్పలు భక్తులను కాళ్ళతో తొక్కినా,దాసప్పలు పొంజుతో తలపై కొట్టినా శుభం కలుగుతుందనే నమ్మకంతో ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి జాతరలో భక్తులు తొక్కించుకుంటారు.
ఒడిషాలో ఓ వింత నమ్మకం ప్రాచుర్యంలో ఉంది. జీవితం సుసంపన్నం అవుతుందన్న నమ్మకంతో దేవతల విగ్రహాలకు లక్షల రూపాయల కరెన్సీ నోట్ల దండలు వేసి నదిలో నిమజ్జనం చేస్తారు. నీళ్లలో వేసిన డబ్బును తీసుకుంటే దేవత ఆగ్రహానికి గురికావల్సి వస్తుందన్న భయంతో ఎవరూ వాటిని తీసుకోరు. కేరళలో మరో విడ్డూరం అమలులో ఉంది. నాడీ శాస్త్రంలో మీరు పాత జన్మలో ఎవరు, ఏమిటి అనే కాకుండా వచ్చే జన్మ లో ఎక్కడ ఎలా జన్మించబోతున్నారో కూడా చెప్పేస్తారు. నవరత్నాలు ధరిస్తే అపజయం ఉండదట. వజ్రాలు కొందరికి అదృష్టాన్ని కలిగిస్తాయని, కొందరికి అవి అరిష్టాన్ని తెస్తాయని నమ్మకం. గోదానం చేసినవారు పడవలో వైతరణి నదిని దాటగలరు గాని, గోదానం చెయ్యలేని పాపాత్ముడు సలసల కాగుతూ ఉండే ఆ నదిలో దిగి నడవవలసిందేనట.
అభివృద్ధి చెందిన, చెందుతున్న కొన్ని ప్రపంచ దేశాలలోనూ ఇలాంటి మూఢ నమ్మకాలు కొన్ని ప్రాచుర్యంలో ఉండడం సాంకేతికతను నమ్ముకున్న మానవాళి చేసుకున్న పాపమనే అనుకోవాలి. జపాన్లో తెల్లపాము ఎదురుపడితే అదృష్ట దేవత కనిపించిందంటారు. ఉత్తర దిశలో తల ఉంచి నిద్రిస్తే అది శాశ్వత నిద్రేనట. మరణించిన వారి తలలను ఉత్తర దిశలో ఉంచి అంత్యక్రియలు నిర్వహిస్తారు. నాలుగు అంకెను అశుభ సూచకంగా పరిగణిస్తారు. ఇండోనేసియా-జకార్తా-తొమ్మిది అంకెను దురదృష్టకరమైనదిగా పరిగణిస్తుంటారు.
ఈ అధ్యక్షుడు నష్టజాతకుడు, సునామీ భూకంపానికి దేశ అధ్యక్షుని ‘దురదృష్ట’ జాతకమే కారణమని అంటున్నారు. గ్రీకు దేశస్థులు రక్షగా ఎర్రరాతి తాయెత్తును ధరించేవారు. పాండు రోగానికి స్ఫటిక రక్షలు ఉపయోగించేవారు. తెల్లగా ఉండి సప్త వర్ణాలను ప్రసరించే ఓపల్ చెట్టు ఆకులో పెట్టి పట్టుకుంటే మనిషి ఇతరులకు కనిపించకుండా సంచరించవచ్చని నమ్మేవారు. ఇక, గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరచడం, సంచార వైద్య బృందాలను పంపించడం, బాణామతి రోగులను ఆస్పత్రులో చేర్చుకుని సత్వర వైద్యసదుపాయాన్ని అందించడం.
బాణామతిపై సరైన అవగాహన కల్పించడం, మానసిక వైద్య నిపుణులను, మానసిక శాస్త్రవేత్తలను, వైద్య, సామాజిక కార్యకర్తలను నియమించడం, సామాజికంగా, ఆర్ధికంగా వృద్ధిలోకి తీసుకు రావడానికి పేదరికాన్ని నిర్మూలించడానికి చర్యలు తీసుకోవడం, సమాచార, ప్రసార సంబంధాలను, రాకపోకల సౌకర్యాలను మెరుగుపరచడం, విజ్ఞాన యాత్రలను, మాయాజల ప్రదర్శనలను వృద్ధిపరచడం, స్వచ్చంద సంస్థలకు ప్రోత్సాహమివ్వడం, మీడియా (పత్రికా ఎలక్ట్రానిక్ ప్రసార మాద్యమాల) పాత్ర బాగా ఉండేలా చూడడం, గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ పాఠశాలలను ప్రారంభించడం, నియత/అనియత విద్యను అందించడం, బాణామతికి వ్యతిరేకమైన పాఠ్యాంశాలను పాఠశాల విద్యాప్రణాళికలో చేర్చడం, బాణమతికి వ్యతిరేకమైన కఠిన చట్టాలను చేయడం, నేరస్తులకు కఠినమైన దండన విధించడం, బాణమతి నమ్మకాన్ని ప్రోత్సహించే టీవీ సీరియళ్లను, సినిమాలను నిషేధించడం, బాణమతి బాధితులకు రక్షణ కల్పించడం, మూఢనమ్మకాలపై ఉండే భీతిని పారద్రోలడం, వైజ్ఞానిక దృక్పధాన్ని పెంపొదించడం వంటివి చేపట్టడం ద్వారా అమాయక జనాల్లో చాలా వరకు అవగాహన పెంపొందించవచ్చు. అంతే గానీ, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా నేటి రాజకీయ, సామాజిక, విద్యా వ్యవస్థలు సాధించేది ఏదీ లేదన్నది తేటతెల్లం.


