ఉపన్యాసాలు కాదు… ఆచరించి చూపించాడు!
కోస్తా జిల్లాలకు, తెలుగు సినీ పరిశ్రమకూ విడదీయలేని అనుబంధం ఉందనడంలో సందేహం లేదు. ఈ ప్రాంతానికి ముఖ్యంగా కృష్ణా జిల్లాకు చెందిన అనేక మంది చిత్ర పరిశ్రమలో స్థిరపడ్డారు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి మహా నటులే కాకుండా అదే స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఆర్జించిన నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులూ ఈ ప్రాంతం నుంచి వెళ్లి తమ సత్తా చాటుకున్నారు. అటువంటి వారిలో తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి ఒకరు. ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తండ్రిగా కంటే కూడా తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తిగానే ఆయన సుపరిచితులు. ప్రముఖ హేతువాదిగా, వామపక్షవాదిగా కూడా ఆయన తనవంతు సేవలు సమాజానికి అందించారు.
కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం చినపాలపర్రులో తమ్మారెడ్డి వెంకటాద్రి, సౌభాగ్యమ్య దంపతులకు 1920 అక్టోబర్ 4న గోపాలకృష్ణమూర్తి జన్మించాడు. చిన్నతనంలోనే ఆయన ‘గోరా’ ప్రభావానికి లోనయ్యాడు. మాలపల్లిలో సహపంక్తి భోజనాలు చేసిన అభ్యుదయవాదిగా తొలిరోజుల్లో ఖ్యాతిగడించారు. కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడిగా చేరి స్వతంత్ర భారత్ అనే పత్రిక రాతప్రతిని చుట్టుపక్కల గ్రామాల్లో సర్క్యులేట్ చేశారు. సూరపనేని శేషగిరిరావుతో కలసి ట్యుటోరియల్ ప్రారంభించాడు. సినిమాల వైపు ఆకర్షితుడయ్యాడు. 1945లో కృష్ణవేణిని వితంతు వివాహం చేసుకున్నారు. 1950 నవంబర్లో మద్రాసుకు మకాం మార్చిన కృష్ణమూర్తి మొదట్లో ట్యూషన్లు చెప్పుకుంటూ కొంత కాలం గడిపారు.
కొడవటిగంటి కుటుంబరావు పేరు పెట్టిన పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షన్ సంస్థలో తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో తొలిసినిమా పల్లెటూరు తీసాడు. సారథి సంస్థ లో చీఫ్ ఎగ్జిక్యూటివ్గా, జనరల్ మేనేజర్గా ఎన్నో చిత్రాల నిర్మాణానికి కృషి చేశాడు. సారథి స్టూడియోస్ తన విశ్వవిద్యాలయం అంటాడు. తెలుగు, తమిళంలో సుప్రసిద్ధ నటీనటులతో పదమూడు చిత్రాలు తీశాడు. హైదరాబాద్లో సారథి స్టూడియో ఏర్పాటుకు కృషి చేశాడు. ఆయనే దానికి తొలి జనరల్ మేనేజరు. ఏరువాక సాగారో పాటకు నర్తించిన వహీదా రెహమాన్ను తీసుకొచ్చింది కృష్ణమూర్తే. 1962లో తానే సొంతంగా సినిమాలు తీయాలనే ఉద్దేశంతో రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ ప్రారంభించాడు.
ఆయనకు రవీంద్ర కవి అంటే ప్రాణం. ఆయన సంస్థలన్నీ రవీంద్రతోనే మొదలయ్యాయి. లక్షాధికారి, జమీందారు, బంగారుగాజులు, ధర్మదాత… ఇలా ఎన్నో చిత్రాలు. జూబ్లీ హిల్స్లో ఫిల్మ్నగర్ వ్యవస్థాపకుడు. జంట నగరాల్లో ఇరవై మూడు కాలనీలను ఒక గొడుగు క్రిందకు తెచ్చి, ఫెడరేషన్ ఏర్పాటు చేశాడు. తెలుగు భాషా చైతన్య సమితికి గౌరవాధ్యక్షుడు. తెలుగు భాషాభ్యుదయ సమాఖ్యకు సలహాదారు. ప్రజానాట్యమండలి పోషకులు. నంది అవార్డు ల కమిటీలో సభ్యుడు, ఛైర్మన్ అయ్యాడు. చిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ సభ్యుడు.
వృద్ధాప్యంలో ఎవరికీ భారం కాకూడనే అభిప్రాయంతో కనుమూసే వరకు వృద్ధాశ్రమంలో కాలం గడిపారు. చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ సభ్యుడు. ఆ సంస్థ నడిపే వృద్ధాశ్రమంలోనూ సేవ చేసేవాడు. ”సినిమా ఒక మజిలీ… సమసమాజం నా అంతిమ లక్ష్యం” అంటూనే ఆయన తన తుదిశ్వాస వీడడం యాదృశ్చికమే. గోపాలకృష్ణమూర్తి 2007లో రఘుపతి వెంకయ్య అవార్డును పొందాడు. ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈయన కుమారుడే. 2013 సెప్టెంబర్ 16న ఆయన తుదిశ్వాస విడిచారు.


