ఐసీసీ.. బీసీసీఐ ముందు ఏమీ చేయలేదు..
బీసీసీఐని కాదని ఏమీ చేయలేని పరిస్థితిలో ఐసీసీ ఉందని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ చెప్పాడు. ఎవరైనా సరే తమ కాళ్ల మీద పటిష్ఠంగా నిలబడలేకపోతే… వారు బలమైన నిర్ణయాలను కూడా తీసుకోలేరని అన్నాడు. బీసీసీఐకి ఇదే బలమని… వారు ఆర్థికంగా, ఆటపరంగా చాలా బలంగా మారిపోయారని చెప్పాడు. అందుకే భారత్ అభిప్రాయాన్ని ఐసీసీ పక్కన పెట్టలేదని అన్నాడు. పాకిస్థాన్ లో భారత జట్టు పర్యటిస్తుందని తాను భావించడం లేదని స్పష్టం చేశాడు. ఇదే సమయంలో ఇండియాలో జరిగే ప్రపంచకప్ లో పాకిస్థాన్ ఆడుతుందనేది కూడా తన భావన అని చెప్పాడు. ప్రపంచకప్ లో పాకిస్థాన్ ఆడాలనే తాను చెపుతానని అన్నాడు.
ఈ ఏడాది ఆసియా కప్ పాకిస్థాన్లో జరగనుంది. అయితే పాకిస్థాన్లో ఆడే ప్రసక్తే లేదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు ఈ అంశంపై మాట్లాడుతూ… ప్రస్తుత సమస్యను పరిష్కరించడంలో ఐసీసీదే కీలక పాత్ర అయినప్పటికీ… బీసీసీఐ ముందు ఐసీసీ ఏమీ చేయలేదని అఫ్రిదీ చెప్పాడు. పాకిస్థాన్ విషయానికి వస్తే… బోర్డు ఆర్థిక పరిస్థితిని బట్టి సరైన ప్రణాళికను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించాడు. భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకుంటే నష్టపోతామని చెప్పాడు. పాక్లో భారత్ ఆడకపోతే, ఇండియాలో జరగబోయే ప్రపంచకప్లో తాము ఆడబోమని పాకిస్తాన్ హెచ్చరించింది. అయినా భారత్ ఏమాత్రం తగ్గలేదు. ఇండియాలో మీరు ఆడినా, ఆడకపోయినా మాకు అనవసరం… మేమైతే పాక్ లో అడుగుపెట్టేదేలేదని కుండబద్దలు కొట్టింది. ఈ నేపథ్యంలో, ఆసియా కప్ వేదికను యూఏఈకి ఐసీసీ మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది.


