చరిత్ర పుటల్లో ‘విశాల విశాఖ’
- 241 Views
- wadminw
- January 2, 2017
- Home Slider సంపాదకీయం
శివపార్వతుల తనయుడు, శుక్ర గ్రహాధినేత, యుద్ధాల దేవుడు, ధైర్య సాహసాలకు ప్రతీక అయిన ‘విశాఖ’ పేరిట ఏర్పాటయినట్లు చరిత్ర గుర్తులు కలిగిన మహా నగరానికి చారిత్రకంగా విశిష్టత ఉందనే చెప్పాలి. ప్రాచీన గ్రంథాలైన రామాయణ, మహాభారతాలలో ఈ ప్రాంత ప్రస్తావన ఉన్నట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. రాముడు సీత కోసం వెదకుతూ ఈ ప్రాంతం గుండానే వెళ్ళినట్లు, ఈ పరిసరాల్లోనే శబరిని కలవగా ఆమె హనుమంతుడు నివసించే కొండలకు దారి చూపినట్లుగా రామాయణం తెలియజేస్తోంది.
రాముడు జాంబవంతుని కలిసింది కూడా ఈ ప్రాంతంలోనేనట. ఈ ప్రాంతంలోనే భీముడు బకాసురుని వధించినాడని ప్రతీతి. ఇక్కడికి 40 కిలోమీటర్ల దూరంలోని ఉప్పలం గ్రామంలో పాండవుల ఆయుధాలను (రాతి) చూడవచ్చు. స్థానికంగా వినవచ్చే కథ ఒకటి కూడా చారిత్రకంగా ప్రచారంలో ఉంది. 9-11 శతాబ్దపు ఒక ఆంధ్ర రాజు కాశీకి వెళ్తూ ఇక్కడ విశ్రాంతి కోసం ఆగాడని, అలా ఆ ప్రదేశ సౌందర్యానికి ముగ్ధుడై,తన ఆరాధ్య దైవమైన విశాఖేశ్వరునికి ఇక్కడ ఒక గుడి నిర్మింపజేసాడని, కానీ, పురాతత్వ శాఖ ఆధారాల ప్రకారం మాత్రం ఈ గుడి 11, 12 శతాబ్దాలలో కుళోత్తుంగ చోళునిచే నిర్మించబడిందని తెలుస్తోంది.
శంకరయ్య చెట్టి అనే ఒక సముద్ర వ్యాపారి ఒక మండపాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ గుడి లేనప్పటికీ, ఒక 100 ఏళ్ళ కిందట తుపానులో కొట్టుకు పోయి ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ ప్రాంతపు పెద్దవారు తమ తాతలతో ఈ గుడికి వెళ్ళినట్లుగా చెప్పే వృత్తాంతాలు మాత్రం ఉన్నాయి. ఈ గుడికి దగ్గరలోనే, నాటి విశాఖపట్నంలోనే ధనికుడయిన వ్యక్తికి పెద్ద ఇల్లు ఉండేదట. ఆ ఇంటి సింహద్వారానికి, దేవుడి గుడికి ఉన్నట్లుగా, చిన్న చిన్న గంటలు ఉండేవని, అ ఇంటి కోడలు, రాత్రి పడుకునే ముందు సింహద్వారపు తలుపులు మూసివేస్తున్నప్పుడు అయ్యే గంటల చప్పుడు ఊరంతా వినబడేవట.
అతి చిన్న గ్రామమయిన విశాఖపట్టణ ప్రజలు, ఆ గంటల చప్పుడు విని, పలానావారి కోడలు పనిపూర్తిచేసుకుని తలుపులు వేసుకుంటుంది అని అనుకునేవారట. అప్పటికి సముద్రం ప్రస్తుతం ఉన్న ప్రదేశానికి చాలా దూరంగా ఉండేదట. గోదావరి నది వరకు విస్తరించిన ప్రాచీన కళింగ సామ్రాజ్యంలో భాగమైన ఈ ప్రాంతపు ప్రస్తావన క్రీ.పూ. 5, 6 శతాబ్దాల నాటి హిందూ, బౌద్ధ గ్రంథాలలోను, క్రీ.పూ. 4వ శతాబ్దికి చెందిన సంస్కృత వ్యాకరణ పండితులైన పాణిని, కాత్యాయనుని రచనలలోను ఉంది. చరిత్ర ప్రకారం, ఇది ఒక పల్లె గ్రామం.
జాలరులు చేపలు పట్టుకునే కుగ్రామం. ఇక్కడ విశాఖేశ్వరుని ఆలయం ఉండేదని, ఆయన పేరుమీదే, ఈ గ్రామానికి ఆ పేరు వచ్చిందట. కాలక్రమంలో, సముద్రం ముందుకు రావటంతో, ముంపునకు గురై, ఆ ఆలయం సముద్రంలో కలిసిపోయిందని చెబుతారు. సముద్రాల పక్కన, నదుల పక్కన ఉండే గ్రామాలను తెలుగు వారు పట్టణంగా పిలిచే వారు. అందుచేత, పూర్వీకులకు, ఆ గ్రామం పేరు వినగానే, ఆ గ్రామం నది ఒడ్డున గాని, సముద్రం ప్రక్కన గాని ఉన్నట్లుగా తెలిసేది. ఆంధ్రులకు ఈ పట్టణం అన్నమాట ఒక సంకేతాన్ని ఇచ్చే పదం.
ఈ ప్రాంతమంతా క్రీస్తు పూర్వం 260లో అశోక చక్రవర్తి పాలనలో కళింగ దేశంగా ఉండేది. ఆ కళింగ దేశంలో, అంతర్భాగంగా ఈ విశాఖపట్టణ ప్రాంతం అంతా ఉండేది. తెలుగుదేశాన్ని, త్రికళింగదేశం అనే (త్రిలింగ దేశం, తెలుగు దేశం) చరిత్రకారులు చెబుతారు. ఈ ప్రాంతాన్ని ఎన్నో ప్రముఖ వంశాల వారు పరిపాలించారు. వాటిలో కొన్ని: 7వ శతాబ్దంలో కళింగులు, 8వ శతాబ్దంలో వేంగి (ఆంధ్ర రాజులు) చాళుక్యులు (ఆంధ్ర మహాభారతం రచన వీరి కాలంలోనే జరిగింది), తరువాతి కాలంలో రాజమండ్రి రెడ్డి రాజులు, పల్లవ రాజులు, చోళులు, తరువాత గంగ వంశం రాజులు గోల్కొండకు చెందిన కుతుబ్ షాహిలు, మొగలులు, హైదరాబాదు నవాబులు, ఈ ప్రాంతాన్ని పాలించారు.
15వ శతాబ్దం నాటికి, ఆంధ్రదేశానికి స్వర్ణయుగం తెచ్చిన విజయనగర సామ్రాజ్యంలో అంతర్బాగమైంది. 260 బి.సి.లో అశోకచక్రవర్తి కళింగ యుద్ధంలో కళింగ దేశాన్ని జయించారు. విశాఖపట్టణం అప్పుడు, కళింగ దేశంలో ఒక భాగంగా ఉండేది. 13 ఎ.డి.లో సింహాచలం దేవస్థానం నిర్మాణం జరిగింది. 208 ఎ.డి.లో చంద్ర శ్రీ శాతకర్ణి విశాఖ ప్రాంతాన్ని పాలించిన రాజు. 1515 ఎ.డి.లో ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయలు విశాల సామ్రాజ్యంలో, విశాఖప్రాంతం ఒక భాగం. అతని పాలనా కాలంలో సింహాచలాన్ని పలు మార్లు దర్శించి, పచ్చల పతకాన్ని, మరికొన్ని నగలను బహూకరించినట్లు శాసనాలు ఉన్నాయి.
ఈ పచ్చల పతకాన్ని గజ్జెల ప్రసాద్ అనే స్టూవర్టుపురం గజదొంగ, దొంగతనం చేసాడట. తర్వాత దొంగ దొరికాడు కానీ, పచ్చల పతకంలోని పచ్చలు కొంచెం విరిగిపోయాయి. 1515లో రాయలు, కొండవీడును ముట్టడించాడు. కొండవీడు 1454 నుండి గజపతుల ఆధీనంలో ఉంది. ఇదే సమయంలో ప్రతాపరుద్ర గజపతి, కృష్ణానది ఉత్తర భాగాన పెద్ద సైన్యంతో విడిదిచేశాడు. ఈ యుద్ధాన రాయలు విజయం సాధించారు. తరువాత రాయలు కొండవీడును అరవై రోజులు పోరాడి 1515 జూన్ 6న స్వాధీనం చేసుకున్నారు.
తరువాత, రాయలు, మాడుగుల, వడ్డాది, సింహాచలం ప్రాంతాలను స్వాధీనం చేసుకొని సింహాచలం నరసింహ స్వామిని పూజించి అనేక దాన ధర్మాలు చేసినట్లు చరిత్ర చెబుతోంది. 1757లో బొబ్బిలి యుద్ధం 23 జనవరి 1757న ఫ్రెంచి జనరల్ బుస్సీ నాయకత్వంలో జరిగింది. విజయనగరం రాజు గెలవటం వలన, బొబ్బిలి సంస్థానం విజయనగరం సంస్థానంలో కలిసింది. 1794లో పద్మనాభయుద్ధం 10 జూలై 1794 నాడు విజయనగరం రాజు (చిన విజయ రామరాజు)కి, కల్నల్ పెండర్గస్ట్ (మద్రాసులోని బ్రిటిష్ గవర్నర్ జాన్ ఆండ్రూస్ తరపున)కి మధ్య జరిగింది.
ఆంగ్లేయులు గెలిచిన కారణంగా, మొత్తం విజయనగరం సంస్థానం (బొబ్బిలి సంస్థానంతో కలిపి), ఆంగ్లేయుల పాలనలోకి వచ్చింది. కానీ, ఈ సంస్థానం అంతా, మద్రాసు ప్రెసిడెన్సీ పాలనలోనికి వచ్చింది అనుకోవాలి. 18వ శతాబ్దంలో విశాఖపట్నం ఉత్తర సర్కారులలో భాగంగా ఉండేది. కోస్తా ఆంధ్రలోని ప్రాంతమైన ఉత్తర సర్కారులు మొదట ఫ్రెంచి వారి ఆధిపత్యంలో ఉండి, తరువాత బ్రిటిషు వారి అధీనంలోకి వెళ్ళాయి. మద్రాసు ప్రెసిడెన్సీలో విశాఖపట్నం ఒక జిల్లాగా ఉండేది.
1804 సెప్టెంబర్లో విశాఖపట్టణం జిల్లా మొట్టమొదటగా ఏర్పడింది. (1803 అని కూడా అంటారు). 1804 నుంచి 1920 వరకు జిల్లా పరిపాలన విధానం గురించి స్పష్టంగా తెలియనప్పటికీ 1857లో ప్రథమ స్వాతంత్ర్య యుద్ధం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెని మూటా ముల్లె సర్దుకుని, భారతా దేశాన్ని, బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పచెప్పి వెళ్ళిపోయింది. భారత దెశ పాలనా బాధ్యతా బ్రిటిష్ ప్రభుత్వం మీద పడింది. 1858లో యునైటెడ్ కింగ్ డం పార్లమెంటు, (బ్రిటిష్ పార్లమెంట్), గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం 1858న చేసింది.
భారత దేశ పాలనా బాధ్యతను, బ్రిటిష్ సివిల్ సర్వీసుకి చెందిన అధికార్లు, తీసుకున్నారు. 1860లో ఇప్పటి మెసర్స్ ఎ.వి.ఎన్. కళాశాల, ఒక చిన్న పాఠశాలగా మొదలైంది. 1866 లేదా 1876లో ఈ చిన్న పాఠశాల, ఉన్నత పాఠశాల ( ఈ నాటి మెసర్స్ ఎ.వి.ఎన్. కళాశాల)గా ఎదిగింది. ఇ. వింక్లర్ అనే యూరోపియన్ అప్పట్లో ప్రధాన ఉపాధ్యాయుడుగా పనిచేశారు. 1878లో ఈ ఉన్నత పాఠశాల (నేటి మెసర్స్ ఎ.వి.ఎన్. కళాశాల), కళాశాల స్థాయికి ఎదిగింది. ఇ.వింక్లర్, ప్రధాన ఉపాద్యాయుడే, ఈ కళాశాలకు ప్రిన్సిపాల్గా కూడా వ్యవహరించారు.
ఈ కళాశాల పేరు అప్పట్లో ‘హిందూ కళాశాల’. 1882లో మద్రాస్ ఫారెస్ట్ చట్టం 1882లో చేశారు. దీనివలన అడవులలో పోడు పద్ధతిన వ్యవసాయం చేసే గిరిజనులకు ఇబ్బందులు కలిగాయి. ఈ ఇబ్బందులే, రంప పితూరీ (1922-1924)కి కారణమయ్యాయని చరిత్రకారులు చెబుతారు. 1858 నుంచి భారత దేశపాలనా బాధ్యతను తీసుకున్న బ్రిటిష్ సివిల్ సర్వీసు వారి స్థానంలో, ఇంపీరియల్ సివిల్ సర్వీసుకి చెందిన అధికార్లు వచ్చారు. (బ్రిటిష్ ఇండియా సివిల్ సర్వీస్)గా కూడా వీరిని పిలిచే వారు.
ఈ అధికార్లను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం 1858లోని సెక్షన్ 32 ప్రకారం నియమించేవారు. తరువాత కాలంలో వీరినే ఇండియన్ సివిల్ సర్వీస్ ఐ.సి.ఎస్గా పిలిచేవారు. 1892లో ‘హిందూ’ కళాశాల పేరును మెసర్స్ ఎ.వి.ఎన్. కళాశాలగా మార్చారు. ఆనాటి జమీందారు ఇచ్చిన 11 ఎకరాల భూమి, లక్షరూపాయల విరాళం, కళాశాల కోసం ఒక పెద్ద భవనం, మరొక 15000 రూపాయలు అతని భార్య గుర్తుగా, అంకితం వెంకట నరసింగరావు విరాళం ఇచ్చాడు. అందుకని అతని భార్య పేరును ఆ కళాశాలకు పెట్టారు.
1902లో ఆంధ్ర వైద్య కళాశాలను స్థాపించారు. ఈ వైద్య విద్యార్థులకు కింగ్ జార్జి ఆసుపత్రిలో శిక్షణ ఇస్తారు. 1904లో మద్రాసు నుంచి కలకత్తా వరకు విశాఖపట్టణం (నాడు వైజాగ్ పటేంగా ఇంగ్లీషు వాడు పలికే వాడు) మీదుగా రైలు దారిని (రైల్వే) ప్రారంభించారు. 1907లో బ్రిటిష్ పురాతత్వశాస్త్రవేత్త, అలెగ్జాండర్ రీ, 2000 సంవత్సరాల నాటి బౌద్ధుల కాలంనాటి శిథిలాలను, విశాఖపట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంకరం గురించి వెల్లడించారు. అక్కడి ప్రజలు, ఆ ప్రాంతాన్ని బొజ్జన్నకొండ అంటారు.
1920లో ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టం, 1920 నుంచి 31 అక్టోబర్ 1959 వరకూ విశాఖపట్టణం జిల్లా పరిపాలన డిస్ట్రిక్ట్ బోర్డ్ (జిల్లా బోర్డ్) ద్వారా జరిగింది. అల్లూరి సీతారామరాజు జరిపిన రంప పితూరీ, 1922 నుంచి 1924 వరకు రెండు సంవత్సరాలు జరిగింది. ఆ సమయంలో, విశాఖపట్నం జిల్లా కలెక్టర్గా రూదర్ ఫొర్డ్ పనిచేశారు. 7 అక్టోబరు 1933న విశాఖపట్టణం (వైజాగ్ పటేం పోర్టు) పోర్టును స్థాపించారు. 6 ఏప్రిల్ 1941న జపాన్ వారి యుద్ధ విమానాలు విశాఖపట్టణం మీద బాంబులు వేశాయి.
అదృష్టవశాత్తు అప్పట్లో ఎవరికీ ప్రాణ నష్టం వాటిల్లలేదు. ఆ భయంతో, విశాఖ వాసులు కొందరు ఇళ్ళు తక్కువ ధరకు అమ్ముకుని విశాఖ వదిలిపోయారట. భయంలేని వారు, ఆ ఇళ్ళను తక్కువ ధరకు కొనుక్కున్న సంగతి, ఆ నాటి తరంవారు కథలు, కథలుగా చెబుతారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చేనాటికి, భారత దేశంలో ఉన్న ఒకే ఒక్క పెద్ద జిల్లా విశాఖపట్టణం. స్వాతంత్ర్యం వచ్చే నాటికి విశాఖపట్నమే దేశంలోకెల్లా అతి పెద్ద జిల్లా. తరువాత దానిని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలుగా విడగొట్టారు.
నేటి తూర్పు నౌకాదళానికి పునాదిగా, 1947లో ఇంగ్లీషు వారు (రాయల్ నేవీ), ఆ నాడు బర్మాలో జరుగుతున్న యుద్ధానికి (రెండవ ప్రపంచ యుద్ధం) సహాయంగా, సరుకులు ఆయుధాలు, రవాణా చేయటానికి ఇక్కడ ఒక బేస్ని స్థాపించారు. దాని పేరే హెచ్.ఎమ్.ఐ.ఎస్. సర్కార్స్ (హెర్ మెజెస్టీ ఇండియన్ షిప్ సర్కార్స్). నేడది ఐ.ఎన్.ఎస్. సర్కార్స్ (ఇండియన్ నేవల్ షిప్)గా పేరు మార్చుకుంది. ఆ నాడు ఇంగ్లీషు వారు వేసిన విత్తనం, నేడు తూర్పు తీరాన్ని అంతా రక్షించే తూర్పు నౌకా దళం అనే వట వృక్షంగా ఎదిగింది.
విశాఖపట్టణం జిల్లా నుంచి 15 ఆగస్టు 1950న శ్రీకాకుళం జిల్లా ఏర్పడింది. 1955లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టం, విశాఖపట్టణం జిల్లాలో డిస్ట్రిక్ట్ బోర్డ్స్ (జిల్లా బోర్డు) పాలన 31 అక్టోబర్ 1959 అంతమైంది. విశాఖపట్టణం జిల్లా ప్రజా పరిషత్ 01.11.1959న ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినం. బల్వంతరాయ్ మెహతా కమిటీ (జనవరి 1957లో కేంద్ర ప్రభుత్వం నియమించింది. 1957 నవంబరులో ఈ కమిటీ తన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది.
1964లో ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతి చట్టం, 1968లో ఆంధ్రప్రదేశ్ మండల్ ప్రజా పరిషధ్స్, జిల్లా ప్రజా పరిషద్, జిల్లా అభివృద్ది సమీక్ష మండల్స్ చట్టం, విశాఖపట్నం జిల్లాలోని కొంత భాగం, శ్రీకాకుళం జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1 జూన్ 1979 న విజయనగరం జిల్లా ఏర్పడింది. దీనితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 23కు చేరింది. ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టం 30.5.1994 నుంచి, అమలులోకి వచ్చింది. విశాఖ జిల్లాలో, బౌధ్ధమతం కూడా వర్ధిల్లింది.
అందుకు గుర్తుగా, ఈ జిల్లాలో బొజ్జన్నకొండ, శంకరం, తొట్లకొండ వంటివి పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. రుషికొండ, రామకృష్ణ బీచ్, భీమునిపట్నం వంటి, చక్కటి సముద్ర తీరాలు, అనంతగిరి, అరకులోయ, కైలాసగిరి వంటి ఎత్తైన కొండల ప్రాంతాలు, భీమునిపట్నంలోని, సాగర నదీ సంగమ ప్రాంతాలు, బొర్రా గుహలు, ప్రసిద్ధి చెందినవి, ప్రాచీనమైన సింహాచలం వంటి దేవాలయాలు, వలస పక్షులు వచ్చే కొండకర్ల ఆవ, తాటి దోనెలలో కొండకర్ల ఆవలో నౌకా విహారం వంటి పర్యాటక కేంద్రాలు జిల్లాలో ఉన్నాయి.
భౌగోళికంగా విశాఖపట్నం జిల్లాను 42 రెవిన్యూ మండలాలుగా విభజించారు. ఇది ఒక పట్టణ ప్రాంతంతో కలిపి మొత్తం 43 విభాగాలు అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టం, 1920, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టం, 1955 ఆధారంగా ఏర్పడిన డిస్ట్రిక్ట్ బోర్డ్ (జిల్లా బోర్డ్ ) ఆనాడు జిల్లా పరిపాలన సాగించేవి. 1804 సెప్టెంబర్లో విశాఖపట్టణం జిల్లా మొట్టమొదటగా ఏర్పడింది. (1803) అని కూడా అంటారు. విశాఖపట్టణం జిల్లా నుంచి 15 ఆగస్టు 1950న శ్రీకాకుళం జిల్లా ఏర్పడింది.
ఆ తరువాత విశాఖపట్టణం జిల్లా ప్రజా పరిషత్ 01.11.1959న ఏర్పడింది. బల్వంతరాయ్ మెహతా కమిటీ (జనవరి 1957లో కేంద్ర ప్రభుత్వం నియమించింది. 1957 నవంబరులో ఈ కమిటీ తన సిఫార్సులను కేంద్రప్రభుత్వానికి సమర్పించింది.) వివిధ స్థాయిలలో అంటే, గ్రామ, మండల, (లేదా బ్లాక్) జిల్లా స్థాయిలో అధికార వికేంద్రీకరణకు సాధనంగా మూడు అంచెల (త్రీ టైర్) పంచాయితీ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఉన్న చట్టం కంటే ముందు, జిల్లా ప్రజా పరిషత్తులు, మండల ప్రజా పరిషత్తులు ఆంధ్రప్రదేశ్ మండల్ ప్రజా పరిషద్స్ అండ్ జిల్లా ప్రజా పరిషద్స్ అండ్ జిల్లా అభివృద్ధి సమీక్ష మండల్స్ చట్టం 1968 (లేదా) 1986 కింద ఏర్పాటు చేయబడ్డాయి.
ప్రస్తుత చట్టం, అంటే, ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టం 1994, యాక్ట్ నెంబరు 13 ఆఫ్ 1994 (1994 సంవత్సరంలో చేసిన 13వ చట్టం), 30.5.1994 నుంచి అమలులోకి వచ్చింది. ఈ కొత్త చట్టం అమలులోకి వచ్చి, అంతవరకూ అమలులో ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ చట్టం 1964, ఆంధ్రప్రదేశ్ మండల్ ప్రజా పరిషధ్స్ జిల్లా ప్రజా పరిషద్ జిల్లా అభివృద్ది సమీక్ష మండల్స్ చట్టం 1968ను రద్దుచేశారు.
ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టం 1994 ఒక సమగ్రమైన చట్టం. ఈ చట్టం, అంతకు ముందు అమలులో ఉన్న చట్టాలలోని అన్ని నిబంధనలను, తనలో విలీనం చేసుకుంది. గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తులలో ఉన్న ఒకే విషయమైన (ఏక రూపం) ఎన్నికలు, సమావేశాలను ఏర్పాటు చేయటం, ప్రతీ అంచెతోను (మూడు అంచెలు) సంబంధాలు నెలకొల్పటం, పరిపాలనా సంబంధమైన నివేదికలు, జమా ఖర్చులు (బడ్జెట్) వగైరా విషయాలను సమగ్రంగా, సవివరంగా కొత్త చట్టంలో పొందుపరిచారు.
విశాఖపట్నం అభివృద్ధి కోసం, విశాఖపట్నం చుట్టుపక్కలఅభివృద్ధి కోసం, 1962 నుంచి, టౌన్ ప్లానింగ్ ట్రస్టు (టి.పి.టి) ఉండేది. ఇదే, టౌన్ ప్లానింగ్ ట్రస్టును 17 జూన్ 1978న వుడాని, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఏరియాస్ (డెవలప్మెంట్) చట్టం 1975 ప్రకారం ఏర్పాటు చేశారు. విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్, మరొక నాలుగు మునిసిపాలిటీలు (విజయనగరం మునిసిపాలిటీ, భీమునిపట్నం మునిసిపాలిటీ, గాజువాక మునిసిపాలిటీ, అనకాపల్లి మునిసిపాలిటీ)లతో సహా 178 గ్రామ పంచాయతీలలో ఉన్న 287 గ్రామాలను కలిపి, వుడాను ఏర్పాటు చేశారు. నాటికి వుడా మొత్తం వైశాల్యం 1721 చదరపు కిలోమీటర్లు.
ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి, బృహత్తర ప్రణాళిక ప్రకారం, అభివృద్ధి కోసం జరుగుతున్న ప్రాజెక్టులను అనుసంధానించటం, వుడా విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ (వి.ఎమ్.ఆర్) కోసం, వుడా ఒక బృహత్తర ప్రణాళికను అభివృద్ధి చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుమతిని పొందింది. విజయనగరం, భీమునిపట్నం, గాజువాక, అనకాపల్లి పట్టణాలకు, ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళిక (జోనల్ డెవలప్మెంట్ ప్లాన్)లకు నాటి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
మధురవాడ, రుషికొండ, గోపాలపట్నం పరిసర ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలను కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నగరాభివృద్ధి కోసం జరుగుతున్న ప్రముఖమైన, ప్రణాళికలను అమలు చేయటం, అనుసంధానించటం వుడా మీద ఉన్న గురుతర బాధ్యత. ఇక, విశాఖలో దర్శనీయప్రదేశాల విషయానికి వస్తే, అనకాపల్లి, పద్మనాభం గ్రామం, భీమునిపట్నం, రాజేంద్రపాళెం గ్రామం, అరకులోయ, సింహాచలం, బొర్రాగుహలు, అనంతగిరి, రామకృష్ణామిషన్ బీచ్, రుషికొండ బీచ్, కైలాసగిరి.
యారాడ బీచ్, యారాడ బీచ్, ఉపమాక వెంకటేశ్వర స్వామి, నక్కపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు, పంచదార్ల, కొండకర్ల ఆవ (వలస పక్షులు, తాటి దోనెలలో, నీటిలో ప్రయాణం), బొజ్జన్నకొండ (బౌద్ధ క్షేత్రం), అనకాపల్లి నూకాలమ్మ, భారతదేశంలో బెల్లం వ్యాపారానికి రెండవ స్థానంలో ఉన్న అనకాపల్లి. భీమిలిలోని ఎర్రమట్టి దిబ్బలు, నది సముద్రంలో కలిసే నదీ సంగమం (అంతర్వేదిలో గోదావరి సంగమం లాగ), డచ్ సమాధులు, మొట్టమొదటి పురపాలక నగరం, ఆహ్లాదంగా ప్రయాణించే కొద్దీ ప్రయాణించాలనిపించే సముద్రం పక్కనే ఉన్న రహదారి (విశాఖపట్నం–భీమిలి రోడ్డు) అల్లూరి సీతారామరాజు పుట్టిన పాండ్రంగి, గురజాడ అప్పారావు పుట్టిన ఎస్. రాయవరం (ఎలమంచిలి సమీపాన), తెలుగు వారి తెగువ చూపించిన పద్మనాభం (పద్మనాభ యుద్ధం), కార్తీకమాసంలో పద్మనాభస్వామి కొండకు వెళ్ళే దారిలోని మెట్లమీద భక్తులు పెట్టే దీపాల వెలుగులు చూడవలసినదే. జిల్లా ఏర్పాటు, విభజన, విస్తరణ అనంతరం పరిపాలనా పరంగా అనేక మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నాయి.
వాటిలో ప్రధానంగా నాలుగు రెవిన్యూ డివిజన్లు ఆవిర్భవించాయి. అవి, విశాఖపట్నం, నర్సీపట్నం, పాడేరు, అనకాపల్లి. విశాఖపట్నం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరంగా విరాజిల్లుతోంది. ఆంధ్రప్రదేశ్లో గ్రేటర్ సిటీ (మహా నగరం) హోదా పొందిన తొలి నగరం (హైదరాబాదు కంటే ముందే). బ్రిటీషు పాలనలో వాల్తేరుగా కూడా పిలువబడింది ఈ నగరం.
బంగాళాఖాతం ఒడ్డున గల ఈ నగరంలో భారతదేశపు నాలుగో పెద్ద ఓడరేవు, దేశంలోనే అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రం ఉన్నాయి. స్వతంత్ర భారత దేశపు మొట్ట మొదటి ఓడ అయిన జల ఉష ఇక్కడే తయారయి, అప్పటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా జలప్రవేశం చేసింది. సుందరమైన సముద్ర తీరం, అహ్లాదకరమైన కొండలతో అలరారే విశాఖ నగరానికి చుట్టుపక్కల ఎన్నో ప్రసిద్ధ యాత్రా స్థలాలు ఉన్నాయి.
అద్భుతమైన అరకులోయ సౌందర్యం, మన్యం అడవుల సౌందర్యం, లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన బొర్రా గుహలు, 11వ శతాబ్ది నాటి దేవాలయం, ప్రాచీన బౌద్ధ స్థలాలు మొదలైన ఎన్నో యాత్రా స్థలాలు విశాఖ చుట్టుపక్కల చూడవచ్చు. విశాఖపట్నం రేవుకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది సహజ సిద్ధమైన నౌకాశ్రయం. సముద్రంలోకి చొచ్చుకొని ఉన్న కొండ కారణంగా నౌకాశ్రయానికి అలల ఉధృతి తక్కువగా ఉంటుంది. డాల్ఫిన్స్ నోస్ అనే ఈ కొండ సహజ సిద్ధమైన బ్రేక్వాటర్స్గా పనిచేస్తుంది.


