తాపేశ్వరం నుంచి బయల్దేరిన మహా లడ్డు
- 103 Views
- wadminw
- September 5, 2016
- రాష్ట్రీయం
హైదరాబాద్: శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్న ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ దంపతులు సోమవారం ఉదయం 9.30 గంటలకు తొలి పూజ నిర్వహిస్తారని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు. అనంతరం సాధారణ భక్తులు దర్శనం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతికి తాపేశ్వరం సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు సమర్పిస్తున్న 500 కిలోల లడ్డూ ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక వాహనంలో నగరానికి బయల్దేరింది.
తాపేశ్వరంలో ప్రత్యేక పూజలు, ఊరేగింపు మధ్య బయల్దేరిన లడ్డూ ప్రసాదం సోమవారం గవర్నర్ తొలిపూజ అనంతరం మహాగణపతికి నైవేద్యంగా సమర్పించననున్నట్లు మల్లిబాబు తెలిపారు. ఇదిలావుండగా, బోయిన్పల్లిలో రెండు దశాబ్దాలుగా ప్రతీయేటా వినూత్న రీతిలో గణపతి మండలపాలను ఏర్పాటు చేస్తున్న రాణా ప్రతాప్ యువసేన ఈ సారి గణపతిని బంగారు వెండిమయం చేస్తున్నారు.
సుమారు రూ.లక్ష విలువ చేసే ‘ఫైబర్ గణపతి’ని పుణేలో ప్రత్యేకంగా తయారు చేయించిన నిర్వాహకులు గణపతికి కేజీ బంగారం చైన్, నాలుగు కేజీల వెండి కిరీటాన్ని సైతం తయారు చేయించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం జరిగే గణపతి కలశ స్థాపనలో ఆయా ఆభరణాల్ని అలంకరించనున్నారు. కాగా ఫైబర్ గణపతిని బోయిన్పల్లి హనుమాన్ దేవాలయంలో ప్రతిష్టంచనుండగా, ఆభరణాలను రాణాప్రతాప్ యువసేన ఆధ్వర్యంలో బ్యాంకులో భద్రపరచనున్నట్లు నిర్వాహకులు జంపన ప్రతాప్, ఆనంద్బాబు, గోవర్థన్రెడ్డి, అరుణ్ కుమార్ తెలిపారు.


