నోట్ల కష్టాలపై కేంద్రం మరో కీలక నిర్ణయం!
నోట్ల రద్దు కష్టాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొనే దిశగా కదులుతోంది. వ్యాపార, పారిశ్రామిక సంస్థలు తమ ఉద్యోగులకు జీతాలు బ్యాంకులు లేదా చెక్కుల ద్వారా, ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించేందుకు వీలుగా కల్పించాలని భావిస్తోంది. ఇందుకోసం వేతనాల చెల్లింపు చట్టం-1936లో మార్పులు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
పలు పరిశ్రమలు తమ ఉద్యోగులకు జీతాలు నేరుగా బ్యాంకులు లేదా, చెక్కుల ద్వారా చెల్లించేందుకు వీలు కల్పిస్తూ ఈ ఆర్డినెన్స్ తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నదని, ఇందుకు సంబంధించి వేతనాల చెల్లింపు (సవరణ) బిల్లు -2016ను ఈ నెల 15న లోక్సభలో ప్రవేశపెట్టిందని, వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఇది ఆమోదం పొందే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అయితే, ఈ రెండు నెలలు ఆగడం వల్ల ఉద్యోగులకు జీతాలు పొందడంలో సమస్యలు ఎదురయ్యే అవకాశముండటంతో ఆర్డినెన్స్ తీసుకురావాలని భావిస్తున్నదని ఆ వర్గాలు చెప్పాయి. పార్లమెంటు సమావేశాల లేనప్పుడు ప్రభుత్వం అత్యవసర విషయాల్లో ఆర్డినెన్స్లు జారీచేసి.. వాటిని ఆరునెలల్లోపు పార్లమెంటులో ఆమోదింపజేసే విషయం తెలిసిందే. ఎలక్ట్రానిక్ పద్ధతిలో నేరుగా ఉద్యోగుల ఖాతాలకు జీతాలు బదిలీ చేయడం లేదా చెక్కు ద్వారా జీతాలు అందించేందుకు వీలుగా వేతనాల చెల్లింపు చట్టంలోని సెక్షన్ 6లో ప్రభుత్వం సవరణలు తీసుకువస్తున్నది.


