నోట్ల రద్దు నిర్ణయంతో దీర్ఘకాల ప్రయోజనాలు: జైట్లీ
న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో దీర్ఘకాలంలో ప్రజలపై పన్నుల భారం తగ్గుతుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ అన్నారు. నగదురహితం, డిజిటల్ పేమెంట్స్ ఇలాగే కొనసాగితే ఏదో ఒక దశలో ప్రత్యక్ష, పరోక్ష పన్నులు భారీగా తగ్గుతాయని మంత్రి చెప్పారు. అయితే కచ్చితంగా ఎప్పటిలోగా పన్నుల భారం తగ్గుతుందన్నది జైట్లీ చెప్పకపోయినా నోట్ల రద్దు వల్ల ప్రభుత్వానికి వచ్చిన అదనపు ఆదాయాన్ని ప్రజలకు బదిలీ చేసే అవకాశం ఉందన్న అంచనాలు పెరిగాయి.
పన్ను ఆదాయం భారీగా పెరిగిన నేపథ్యంలో జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు ప్రభావం పన్ను వసూళ్లపై ఏమాత్రం కనిపించలేదు. ఏప్రిల్, నవంబర్ మధ్యకాలంలో ప్రత్యక్ష పన్నుల వృద్ధి 15 శాతం పెరగగా, ఇదే కాలంలో పరోక్ష పన్నుల్లో 26 శాతం వృద్ధి ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఇక నవంబర్ 30న ప్రకటించిన ఇన్కమ్ డికల్రేషన్ స్కీమ్తో పన్ను ఆదాయం మరింత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వ్యవస్థలో నగదు రూపంలో పెద్ద మొత్తంలో చెలామణి అవుతున్న కరెన్సీ మొత్తం ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేసింది.
ఇందులో పన్ను కట్టని లెక్కచూపని ఆదాయనికి ఇప్పుడు పన్ను వసూలు చేయాల్సి ఉంది అని జైట్లీ చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. సాధారణంగా ప్రతి ఏడాది కంటే ఈసారి సుమారు నెల ముందే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇక భవిష్యత్తులో చాలా వరకు డిజిటల్ పేమెంట్లే ఉండబోతుండటంతో అదంతా పన్ను ఆదాయం కిందకే రాబోతుందని జైట్లీ అన్నారు.
నోట్ల రద్దు నిర్ణయం వల్ల బ్యాంకుల్లో భారీగా డబ్బు జమకావడంతో బ్యాంకుల రుణ సామర్ధ్యం పెరిగిందని, ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బ్యాంకులు తమ వంతు సాయం చేయనున్నాయని జైట్లీ తెలిపారు. రానున్న మూడు వారాల్లో పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీకి ఆర్బీఐ బ్యాంకులకు పంపిణీ చేయబోతోందని దీనివల్ల ఇప్పటివరకు ఉన్న ఇబ్బందులు కూడా తొలుగుతాయని జైట్లీ స్పష్టం చేశారు.


