పాతతరం నటులకు స్ఫూర్తి కొచ్చర్లకోట!
తొలితరం తెలుగు సినీ నటులకు స్ఫూర్తి ప్రధాతలుగా చెప్పుకొనే వారిలో కొచ్చర్లకోట సత్యనారాయణ ఒకరు. పాతతరం తెలుగు సినిమా, రంగస్థల నటుడిగానే కాకుండా సినీ సంగీత దర్శకుడు, నేపథ్యగాయకుడిగా కూడా కొచ్చర్లకోట గుర్తింపు తెచ్చుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని జమీందారీ కుంటుంబంలో 1915 ఏప్రిల్ 2న జన్మించిన ఈయన బాల్యమంతా భీమడోలులోని తాతగారింట్లో గడిచింది.
ఆయన బాల్యంలో గ్రామఫోన్ ముందు కూర్చుని ఆ పాటలను శ్రద్ధగా వింటూండేవారు. ఆయన రాజమండ్రిలో ఉన్నత పాఠశాలలో చదివేటప్పుడు మాచిరాజు రామచంద్ర మూర్తి ‘కేసరి సమాజం’లో చేరారు. అలా అక్కడ రంగస్థలంపై నటనను ప్రారంభించారు. ఆయన చింతామణి, ప్రతాపరుద్రీయం వంటి నాటకాలలో నటించి వచ్చిన సొమ్మును పాఠశాలలకు గ్రంథాలయాలకు విరాళంగా ఇచ్చేవారు.
ఆయన సినిమా రంగంలో ద్రౌపది వస్త్రాపహరణం చిత్రంతో ప్రవేశించారు. ఆ చిత్రం సరస్వతీ టాకీస్ వారిది. ఆయన జరాసంధ చిత్రంలో కృష్ణునిగా, వరవిక్రయం చిత్రంలో బసవరాజుగా, వై.వి.రావు మళ్ళీ పెళ్ళి”లోనూ, పాదుకా పట్టాభిషేకంలో లక్ష్మణునిగా నటించారు. ఆయన మళ్లీ రంగస్థలంలో ప్రవేశించి వేమూరి గగ్గయ్య , స్థానం నరసింహారావుతో కలసి జరాసంధ, సారంగధర, తులాభారం నాటకాలలో నటించారు.
ఆ తర్వాత ఆయన బందా కనకలింగేశ్వరరావు ప్రభాత్ థియేటర్లో చేరి పాండవ విత్రంలో అర్జునునిగానూ, బొబ్బిలి యుద్ధంలో వెంగళరావు గానూ, సతీసావిత్రిలో సత్యవంతునిగానూ, చింతామణిలో భవానీశంకరం గానూ, కాళిదాసులో కాళిదాసు గాను నటించారు. ఆయన రామాంజనేయ యుద్ధంలో రామునిగా బేతా వెంకటరావుతో కలసి నటించారు.
1969 డిసెంబరు 21న ఆయన ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో మరణించారు. సినీ పరిశ్రమలో సీతా కళ్యాణం (1934), ద్రౌపది వస్త్రాపహరణం (1936), జరాసంధ (1938), మళ్లీ పెళ్ళి (1939), వరవిక్రయం (1939), పాదుకా పట్టాభిషేకం (1945) చిత్రాలలో నటించడంతో పాటు మళ్లీపెళ్లి చిత్రానికి నేపథ్యగాయకునిగా పనిచేశారు.


