పాత్రికేయ ధిగ్గజం… నండూరి ‘విశ్వరూపం’
నండూరి రామమోహనరావు తెలుగు పాత్రికేయరంగ ప్రముఖులు. పాత్రికేయునిగానే కాక, రచయితగా కూడా ప్రసిద్ధులు. చాలాకాలం పాటు ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదక బాధ్యతలు నిర్వహించారు. ‘బాల’ అన్న పత్రికలోనూ, ఆంధ్రపత్రికలోనూ 1940వ దశకంలో వీరి రచనలు ఎన్నో ప్రచురింపబడ్డాయి. ‘నరావతారం’, ‘విశ్వరూపం’ ఈయన ప్రముఖ రచనలు. సామాన్య జనాలకు సైన్సు సంగతులు పరిచయం చేయడంలో వీరి కృషి ఎన్నదగ్గది. ఇవికాక వీరు ఆంధ్రపత్రికలో మార్క్ ట్వేన్ నవలలకు తెలుగు అనువాదాలు కూడా చేసారు.
నండూరి రామ్మోహనరావు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగొలను గ్రామంలో 1927 ఏప్రిల్ 24న జన్మించారు.1937-42 మధ్య నూజివీడు, మచిలీపట్నంలో హైస్కూలు విద్యనభ్యసించారు. రాజమండ్రి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో 1942-47 మధ్య చదువుకున్నారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థిగా ఉండగానే ‘విజ్ఞానం’ అనే లిఖిత పత్రికను నడిపారు. నండూరి తన 21వ ఏటనే పాత్రికేయుడిగా తన ప్రస్థానం ప్రారంభించారు. 1944 ఏప్రిల్ 30వ తేదీన మేనమామ కూతురు రాజేశ్వరిని వివాహమాడారు. కొన్నాళ్ళు ఋషీకేశంలో ఉన్నారు. ఆ తరువాత 1947లో కొన్ని నెలలు ఉదయభారతి గురుకులంలో పనిచేశాక, ‘జన్మభూమి’ అన్న పత్రికలో సబ్ ఎడిటరుగా ఉద్యోగంలో చేరారు.
1948-1960 మధ్యలో వివిధ స్థాయుల్లో ఆంధ్రపత్రికలో పనిచేశారు. 1960-1994 దాకా ఆంధ్రజ్యోతి పత్రికలో వివిధ స్థాయుల్లో పని చేసి, సంపాదకులు గా పదవీ విరమణ చేశారు. ఆ సమయంలోనే జ్యోతిచిత్ర, వనితాజ్యోతి, బాలజ్యోతి వంటి పత్రికలకు వ్యవస్థాపక సంపాదకులుగా ఉన్నారు. ఆయన జర్నలిస్టు జీవితం ఆంధ్రపత్రికలో ప్రారంభమైంది. 1948 నుంచి 1960 వరకు ఆయన ఆంధ్రపత్రికలో పనిచేశారు. 1960లో సహ సంపాదకుడి ¬దాలో ఆంధ్రజ్యోతిలో అడుగు పెట్టారు.1960 నుంచి 1994 దాకా, అంటే 34 సంవత్సరాల కాలం ఆయన ఆంధ్రజ్యోతిలో అక్షర యాత్ర చేశారు. ఆయన ఎంతో మందిని పాత్రికేయులుగా తీర్చి దిద్దారు.
సూటిగా, సరళంగా ఉండే ఆయన సంపాదకీయాలు పాఠకులపై మంచి ప్రభావం చూపేవి. తొలితరం సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావుతో కలసి పని చేశారు. నార్ల నిష్క్రమణ అనంతరం 1980లో నండూరి రామమోహనరావు ఆంధ్రజ్యోతి సంపాదకుడిగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. ఆయన 1962, 1978, 1984, 1992లలో అమెరికాలోను, 1982లో రష్యాలో పర్యటించారు. బాపు – రమణలు నండూరిని ‘అనువాద హనుమంతుడు’ అని కొనియాడారు. సుప్రసిద్ధ ఆంగ్ల రచనలను అచ్చ తెలుగులో, అందరికీ నచ్చేలా, తనదైన ప్రత్యేక శైలిలో అనువదించడమే దీనికి కారణం. మార్క్ట్వేన్ రచించిన టామ్ సేయర్, హకిల్ బెరిఫిన్లను అవే పేర్లతో అనువదించారు.
మార్క్ట్వేన్ మరో రెండు రచనలను రాజు – పేద, విచిత్ర వ్యక్తి పేరిట అనువదించారు. అలాగే కాంచన ద్వీపం (రాబర్ట్ స్టీవెన్సన్) అనే మరో అనువాద రచన కూడా చేశారు. 61 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ఆ పుస్తకాలకు ఆదరణ ఉండడం విశేషం. నండూరి ఖగోళ, భౌతిక శాస్త్రాలను పరిశోధించి ‘విశ్వరూపం’ అనే పుస్తకం రచించారు. మానవాళి పరిణామ క్రమానికి సంబంధించిన నరావతారం, తత్త్వశాస్త్రాన్ని సులువుగా వివరించే ‘విశ్వ దర్శనం’ ఆయన కలం నుంచి జాలువారినవే. నండూరి సవ్యసాచి పేరుతో రాజకీయ వ్యంగ్య రచనలు, హరివిల్లు పేరుతో బాల గేయాలు, ఉషస్విని పేరిట కవితలు రచించారు. కథా గేయ సుధానిధి (లేదా యూసఫ్) కూడా ఆయన రచనే. మిత్రలాభం, మిత్ర భేదం (పంచతంత్ర కథలు) పేరిట బాపు వేసిన బొమ్మలకు నండూరి మాటలను అందించారు.
ఇంద్రగంటి శ్రీకాంత శర్మతో కలిసి ‘మహా సంకల్పం’ అనే సంకలనాన్ని వెలువరించారు. సంపాదకీయాల సంకలనం అను పల్లవి, చిరంజీవులు, వ్యాఖ్యావళి ఆయన ఇతర రచనలు. నండూరి రామమోహనరావు రాసిన ఐదు పుస్తకాలను న్యూస్టూడెంట్ బుక్ సెంటర్ ఆధినేత బాబ్జీ ప్రచురించి 2006 మే 9వ తేదీన ఆవిష్కరించారు. వీటిని పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు, కళాప్రపూర్ణ మిక్కిలినేని రాధాకృష్ణ, స్వాతంత్య్ర సమరయోధుడు పరకాల పట్టాభిరామారావు, పాత్రికేయులు వీరాజీ, ఎస్.ప్రకాశరావులు ఆవిష్కరించారు. ఆ రోజున నండూరి రామమోహనరావును సత్కరించారు. నండూరి రామమోహనరావుకు అనేకమంది ప్రముఖ పాత్రికేయులు, రచయితలతో సన్నిహిత సంబంధాలున్నాయి.
ఆంధ్రపత్రికలో పని చేస్తున్నపుడు వారపత్రికకు సంబంధించి కొడవటిగంటి కుటుంబరావు, పండితారాధ్యుల నాగేశ్వరరావు, తెన్నేటి సూరి, పిలకాగణపతిశాస్త్రి వంటి హేమాహేవిూలతో సాహిత్యంపై చర్చించేవారు. ఆంధ్రపత్రిక వీక్లీలో ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువదించి ప్రచురించాలని సంకల్పించినప్పుడు అనువాద బాధ్యతలను నండూరికే అప్పగించారు. సాహితీ వేత్తలు ఆరుద్ర, శ్రీశ్రీలతోపాటు ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు రామచంద్రమూర్తి, ప్రస్తుత సంపాదకుడు కె.శ్రీనివాస్లతో నండూరికి అనుబంధం ఉంది.
నండూరి రచనలు… అనువాదాలు… అవార్డులు…
నరావతారం
విశ్వరూపం
విశ్వదర్శనం – భారతీయ చింతన
విశ్వదర్శనం – పాశ్చాత్య చింతన
అనుపల్లవి (ఆంధ్రజ్యోతి సంపాదకీయాల సంకలనం)
చిరంజీవులు (ఆంధ్రజ్యోతి సంపాదకీయాల సంకలనం)
వ్యాసావళి (ఆంధ్రజ్యోతి సంపాదకీయాల సంకలనం)
అక్షరయాత్ర (సాహిత్య, సాహిత్యేతర వ్యాససప్తతి)
ఉషస్విని (కవితా సంపుటి)
చిలక చెప్పిన రహస్యం (పిల్లల నవల)
మయూర కన్య (పిల్లల నవల)
హరివిల్లు (పిల్లలగేయాలు)
కాంచన ద్వీపం (ఆర్.ఎల్.స్టీవెన్సన్ ట్రెజర్ ఐలాండ్ కి తెలుగు అనువాదం)
కథాగేయ సుధానిధి (మూలం:ఏసోప్స్ ఫేబుల్స్)
టామ్ సాయర్ (మూలం: మార్క్ ట్వేన్ నవల – అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్)
హకిల్బెరీ ఫిన్ (మూలం: మార్క్ ట్వేన్ నవల – అడ్వెంచర్స్ ఆఫ్ హకిల్బెరీ ఫిన్)
రాజు-పేద (మూలం: మార్క్ ట్వేన్ రచన – ప్రిన్స్ అండ్ పాపర్)
టామ్ సాయర్ ప్రపంచయాత్ర (మూలం: మార్క్ ట్వేన్ రచన – టామ్సాయర్ అబ్రాడ్)
విచిత్ర వ్యక్తి (మూలం: మార్క్ ట్వేన్ రచన – మిస్టీరియస్ స్ట్రేంజర్)
బాలరాజు (ఆస్కార్ వైల్డ్ కథలు తెలుగు అనువాదం)
అభినందన (హైదరాబాదు) సంస్థ నుంచి ముట్నూరి కృష్ణారావు అవార్డు (1988).
జూలూరి నాగరాజారావు (హైదరాబాదు) స్మారక అవార్డు (1989)
మద్రాసు తెలుగు అకాడెవిూ ఉగాది వెలుగు అవార్డు (1989)
కళాసాగర్ (మద్రాసు) అవార్డు
అభిరుచి (ఒంగోలు) సంస్థ వారి పాత్రికేయ రత్న అవార్డు.
జవిూన్ రైతు వజ్రోత్సవంలో నెల్లూరి వెంకట్రామానాయుడు స్మారక అవార్డు (1990)
ఆలూరి నారాయణరావు స్మారక ట్రస్టు (విజయవాడ) వారి సి.వై.చింతామణి అవార్డు
తెలుగు యూనివర్సిటీ వారి ఆనరరీ డాక్టరేట్ (1991)
అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి శిరోమణి అవార్డు (1992)
క్రాంతి విద్యా సంస్థల (విజయవాడ) నుంచి ఉత్తమ జర్నలిస్టు అవార్డు (1994)
రామకృష్ణ జైదయాళ్ హార్మొనీ అవార్డు (1994)
సిద్ధార్త కళా పీఠం (విజయవాడ) వారి విశిష్ట వ్యక్తి అవార్డు (1994)
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వపు ఉత్తమ జర్నలిస్టు అవార్డు (1996)
తెలుగు యూనివర్సిటీ వారి తాపీ ధర్మారావు స్మారక అవార్డు (1997)
అప్పాజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ వారి ప్రతిభామూర్తి అవార్డు (1998)


