పెద్ద చిత్రాల ఆడియో హక్కులన్నీ లహరివే!
దక్షిణ భారతదేశంలో ఎన్నో ఏళ్ళ నుండి ఆడియో రంగంలో ఉండి ఎన్నో విజయవంతమైన చిత్రాల ఆడియోలను ప్రేక్షకులకు అందించిన ప్రతిష్టాత్మక ఆడియో సంస్థ లహరి మ్యూజిక్. తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్ధాయిగా నిలిచేలా మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం 150, నందమూరి నట సింహం బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి 2 చిత్రాలు రూపొందుతున్నాయి. ఈ మూడు చిత్రాలు వచ్చే సంవత్సరం ప్రధమార్ధంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.
అయితే ఈ మూడు చిత్రాల ఆడియోలపై అటు అభిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోను భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఆడియో రైట్స్ విషయంలో భారీ పోటీ ఏర్పడింది. అయినప్పటికీ ప్రముఖ ఆడియో సంస్థ లహరి మ్యూజిక్ ఈ మూడు భారీ చిత్రాల ఆడియో రైట్స్ దక్కించుకోవడం విశేషం. ఈ సందర్భంగా లహరి మ్యూజిక్ అధినేత జి.మనోహర్ నాయుడు మాట్లాడుతూ ‘‘చిరంజీవి సినిమాలు మాస్టర్, హిట్లర్, మెకానిక్ అల్లుడు, ముఠామేస్త్రి, ఆపధ్భాంధవుడు, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్, ముగ్గురు మొనగాళ్లు చిత్రాల ఆడియోలను మా సంస్థ ద్వారానే రిలీజ్ చేసాం. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోను, చిరంజీవి కెరీర్లోను ప్రతిష్టాత్మకమైన చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం 150 చిత్రం ఆడియో రైట్స్ను కూడా మా లహరి మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేస్తుండడం చాలా సంతోషంగా ఉంది.
ఈ సందర్భంగా చిరంజీవికి, వినాయక్కు, రామ్ చరణ్, దేవిశ్రీప్రసాద్కు థ్యాంక్స్’’ తెలియచేస్తున్నాను. ఇక మా సంస్థ దక్కించుకున్న మరో ప్రతిష్టాత్మకమైన చిత్రం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. బాలకృష్ణ నటించిన లెజెండ్, లయన్, లారీ డ్రైవర్, నారి నారి నడుమ మురారి, రౌడీ ఇన్ స్పిక్టెర్, అశ్వమేధం, నిప్పురవ్వ, బంగారు బుల్లోడు, మిత్రుడు చిత్రాల ఆడియోలను తమ సంస్థ ద్వారానే విడుదల చేశామని, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోను, బాలకృష్ణ కెరీర్లో ప్రతిష్టాత్మక చిత్రమైన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం ఆడియోను కూడా లహరి ద్వారానే రిలీజ్ చేస్తుండడం చాలా సంతోషంగా ఉందన్నారు.
తమ సంస్థకు ఈ అవకాశం ఇచ్చిన బాలకృష్ణకు, దర్శకుడు క్రిష్కు, నిర్మాతలు జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్ రెడ్డి, బిబో శ్రీనివాస్, సంగీత దర్శకుడు చిరంతన్ భట్కు ధన్యవాదాలు తెలియజేశారు. ఖైదీ నెం 150, గౌతమీపుత్ర శాతకర్ణి ఈ రెండు చిత్రాల తర్వాత లహరి మ్యూజిక్ ద్వారా రిలీజ్ కానున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి 2. తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటి చెప్పిన సంచలన చిత్రం బాహుబలి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా రూపొందిన బాహుబలి ఎవరూ ఊహించని విధంగా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించడం విశేషం. దీంతో బాహుబలి 2 ఏరేంజ్లో ఉంటుందో?
ఎంత కలెక్ట్ చేస్తుందో? అనే ఆసక్తి రోజురోజుకు పెరుగుతుంది. ప్రభాస్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేసిన బాహుబలి 2 ఫస్ట్ లుక్కు అద్భుతమైన స్పందన లభించింది. దీంతో బాహుబలి 2 సినిమాతో పాటు ఆడియో ఏస్ధాయిలో ఉండబోతుందో అనే ఇంట్రస్ట్తో ఆడియోపై క్రేజ్ మరింత పెరిగింది. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ చిత్రానికి ఇవ్వని ఫాన్సీ రేట్తో బాహుబలి, బాహుబలి 2 ఆడియో రైట్స్ను తమ సంస్థ దక్కించుకుందన్నారు. ప్రభాస్ నటించిన డార్లింగ్, బిల్లా చిత్రాల ఆడియోలను లహరి మ్యూజిక్ ద్వారానే రిలీజ్ చేశామన్నారు. ఇప్పుడు బాహుబలి, బాహుబలి 2 ఆడియోలను కూడా లహరి ద్వారానే రిలీజ్ చేస్తుండడం చాలా హ్యాపీగా ఉందన్నారు.
ముఖ్యంగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో స్వరవాణి కీరవాణి ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలకు మ్యూజిక్ అందించారని, అంతే కాకుండా అన్నమయ్య చిత్రానికి గాను ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డ్ అందుకున్నారన్నారు. జాతీయ స్ధాయిలో పేరు సంపాదించిన కీరవాణి సంగీతం అందించిన బాహుబలి, బాహుబలి 2 చిత్రాల ఆడియోను తమ సంస్ధ ద్వారా రిలీజ్ చేస్తుండడం తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. ఈ ఆడియో రైట్స్ తమకు ఇచ్చి ప్రోత్చాహించిన రాజమౌళికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మూడు ప్రతిష్టాత్మక చిత్రాల ఆడియోలు లహరి సంస్థ దక్కించుకోవడం గర్వంగా వుందన్నారు. భవిష్యత్లో మరిన్ని ప్రతిష్టాత్మక చిత్రాల ఆడియోలను తమ సంస్థ ద్వారా రిలీజ్ చేయనున్నామన్నారు.


