ప్రభుత్వ పథకాలకు సత్వరమే రుణాలు
కాకినాడ, సెప్టెంబర్ 22 (న్యూస్టైమ్): వివిధ కార్పొరేషన్ల ద్వారా లబ్దిదారుల ఉపాధి యూనిట్లు, స్వయం సహాయ సంఘాల ఆర్ధిక కార్యక్రమాలు, చిన్నతరహా వ్యాపారాలు, వృత్తులకు రుణాల కల్పన కు బ్యాంకులు మరింత చొరవతో ముందుకు రావాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్కుమార్ బ్యాకంర్లను కోరారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ కోర్టు హాలులో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, బ్యాంకుల అధికారులతో జిల్లా స్థాయి సమీక్షా కమిటీ, జిల్లా కన్సల్టేటీవ్ కమిటీ సమావేశాలు జిల్లా కలెక్టర్ అరుణ్కుమార్ అధ్యక్షత జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజనుకు జిల్లాలోని రైతులకు 4251 కోట్లు పంటరుణాలు కల్పించే లక్ష్యానికి గాను ఇప్పటి వరకూ 3922 కోట్లు రుణాలు కల్పించి 92 శాతం లక్ష్యాన్ని పూర్తి చేయడం జరిగిందన్నారు. అలాగే జిల్లాలో లక్షా 30 వేల మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు జారీ చేయగా 45,581 మంది రైతులకు 97 కోట్లు మేరకు పంటరుణాలు కల్పించారన్నారు.
కౌలు రైతులకు రుణాల కల్పన మరింత సరళం చేస్తూ వ్యవసాయ శాఖ ద్వారా సాగు ధృవీకరణ ప్రత్రాల జారీని ప్రభుత్వం ఆదేశించిందని, ఈ మేరకు జిల్లాలో సాగు చేపట్టీన కౌలు రైతులందరికీ ఈ పత్రాలు జారీ చేసి రుణాలు అందేట్లు చూడాలని, ఈ నెలాఖరులోగా మరో 30 కోట్లు రుణాలు అందించాలని సూచించారు. జిల్లాలో స్వయం సహాయ బృందాలకు ఈ యేడు 1346 కోట్లు రుణాల కల్పన లక్ష్యానికి గాను ఇప్పటి వరకూ 229 కోట్లు రుణాలు అందిచామన్నారు. జిల్లాలో చిన్న వ్యాపారస్తులు, వృత్తికారులు అధిక వడ్డీ రుణాల ఊబిలో చిక్కుకోకుండా వర్కింగ్ కాపిటిల్ క్రింద 5 నుండి 15 వేల రూపాయిల డిఆర్ఐ రుణాల కల్పనలో బ్యాంకులు మరింత చొరవ చూపాలని, పట్టన ప్రాంతాల్లోని ప్రతి బ్యాంకు బ్రాంచి నెలకు కనీసం 100 రుణాలు కల్పించాలని ఆయన కోరారు. చంద్రన్న భీమా పధకం క్రింద జిల్లాలో నమోదైన 17 లక్షల మందిలో సుమారు 3 లక్షల మందికి బ్యాంకు అకౌంట్లు అక్టోబరు 2నలోగా తెరవాల్సి ఉన్నందున బ్యాంకులు, డిఆర్డిఏ అధికారులు సమన్వయంతో సకాలంలో అకౌంట్లు కల్పించి లబ్దిదారులు నష్టపోకుండా చూడాలని ఆదేశించారు.
వివిధ కార్పొరేషన్ల ద్వారా లబ్దిదారులకు యూనిట్ల గ్రౌండిగ్ ప్రక్రియను మరింత ముమ్మరం చేయాలన్నారు. ప్రభుత్వ సబ్సిడినే లబ్దిదారులకు రుణాలుగా జారీ చేసినట్లు చూపి, వాస్తవంగా రుణాల జారీ ఎగవేసే బ్యాంకుల అవాంచిత పోకడలను ఎస్ఎల్బిసి, ఆర్బిఐ ల దృష్టికి తీసుకెళతామన్నారు. వ్యవసాయ అనుబంధ రుణాలకు అర్బన్ ఆస్తుల ష్యూరిటీ చూపాలని కోరవద్దన్నారు. పరిశ్రమలకు రుణాల కల్పనలో జాప్యం నివారణకు సింగిల్ విండో వ్యవస్థలోకి బ్యాంకులను కూడా చేర్చేలా ఎస్ఎల్బిసిని కోతామన్నారు. సమావేశంలో జడ్పి చైర్మన్ నామన రాంబాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పాల్గొని స్వయం సహాయ బృందాల రుణాలు, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ రుణాలు త్వరితగతిన జారీ చేయాలని బ్యాంకర్లను కోరారు.
డ్వాక్రా సంఘాలకు రుణాలు జారీచేసి వాటిని మహిళలకు ఇవ్వకుండా ఫిక్స్డ్ డిపాజిట్లుగా ఉంచుకుంటున్న బ్యాంకులపై చర్యకు కోరారు. అలాగే రుణాల ప్రాసెసింగ్ ఫీజుగా ఒకో బ్యాంకు ఒకో రకంగా సొమ్ము వసూలు చేస్తున్నాయన్నారు. మండల స్థాయిలో నిర్వహించే జెఎంఎల్బిసి సమావేశాలకు బ్రాంచి మేనేజర్లు తప్పని సరిగా హాజరు కావాలని కోరారు. మహిళా సంఘాలు తమ పొదుపు మొత్తాలను ఇంటర్నల్ లెండింగ్ కొరకు తీసుకోవడానికి బ్యాంకులు నిరాకరించడం తగదన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రాబ్యాంకు డిజియం ఆర్.బాస్కరరావు, ఎల్డియం బి.వి.సుబ్రమణ్యం, నాబార్డు ఎజియం కె.వి.ఎస్.ప్రసాద్, ఆర్బిఐ ఏజిఎం సి.బి.గణేష్, డిఆర్డిఏ పిడి ఎస్.మల్లిబాబు, వ్యవసాయశాఖ జేడి కే.వి.ఎస్.ప్రసాద్, వివిధ కార్పొరేషన్ల ఈడిలు పాల్గొన్నారు.


