బహుముఖ ప్రజ్ఞా విశేషాలతో భానుమతీ ప్రయాణం
భానుమతీ రామకృష్ణ… ప్రముఖ దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచరుత్రి, గాయని, సంగీత దర్శకురాలు. భానుమతి 1925వ సంవత్సరం సెప్టెంబరు నెలలో ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు. ఆమె తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య, శాస్త్రీయ సంగీత ప్రియుడు, కళావిశారదుడు. భానుమతి తండ్రి వద్ద నుండే సంగీతాన్ని అభ్యసించారు. అనేక కట్టుబాట్లు గల కుటుంబ వాతావరణంలో పెరిగినప్పటికీ ఆమె ఎంతో ధైర్యంగా పదమూడేండ్ల చిరుత ప్రాయంనాడే 1939లో విడుదలైన వరవిక్రయం అనే సినిమాలో నటించారు. ఈ సినిమా నిర్మాణ సమయంలో తన కుమార్తెను తాకరాదని ఆమె తండ్రి షరతు విధించాడట! హీరో, నిర్మాతలు అలాగే నడుచుకున్నారు.
ఆమె 1943 ఆగష్టు 8న తమిళ, తెలుగు చిత్ర నిర్మాత, డైరెక్టరు, ఎడిటరు అరున పి.యస్. రామకృష్ణారావును ప్రేమ వివాహమాడారు. వీరి ఏకైక సంతానం భరణి. ఈ భరణి పేరుమీదనే భరణీ స్టూడియో నిర్మించి, అనేక చిత్రాలు ఈ దంపతులు నిర్మించారు. 2005 డిసెంబర్ 24న చెన్నైలోని తన స్వగృహంలో భానుమతీ రామకృష్ణ పరమపదించారు. తన బహుముఖ ప్రజ్ఞా విశేషాలతో ఎన్నో సాధించి, ఎందరికో ఆదర్శంగా నిలిచిన భానుమతి మృతికి పలువురు ప్రముఖులు బాష్పాంజలి ఘటించారు. కాగా, భానుమతి అర్ధ శతాబ్దానికి పైబడి సినీ రంగంలో ఉన్నప్పటికీ, భానుమతి నటించిన చిత్రాలు సుమారు నూరు మాత్రమే. ఆమె సినిమాలలో మల్లీశ్వరి, మంగమ్మగారి మనవడు వంటి ఆణిముత్యాలు ఎన్నో ఉన్నారు. విజయా వారి మిస్సమ్మ సినిమాలో ప్రధాన పాత్రకు మొదట భానుమతినే తీసుకున్నారు.
అయితే షూటింగు మొదలైన తర్వాత చక్రపాణికి ఆమె వ్యవహార శైలి నచ్చక ఆమె స్థానంలో సావిత్రిని తీసుకున్నారు. ఈ సంగతి గురించి ప్రస్తావిస్తూ భానుమతి ఏటా తాను వరలక్ష్మీ వ్రతం చేసుకుంటాను కనుక ఒక గంట లేటుగా వస్తానని ముందు రోజు చెప్పినా అధికారపూర్వకంగా చక్రపాణి నొప్పించారని రాసుకున్నారు. సావకాశంగా ఆలోచిస్తే చక్రపాణి తప్పేముంది? నా సమయం బాగోలేదేమోనని భావించినట్టుగా వివరించారు. ఆ సినిమా విడుదలై, ఘన విజయం సాధించాక భానుమతి నేను మిస్సమ్మలో నటించకపోవడం వల్ల సావిత్రిలాంటి గొప్పనటి వెలుగులోకి వచ్చింది, అని సంతోషించింది. భానుమతి కేవలం నటిగానే కాక బహుముఖ ప్రజ్ఞాశాలిగా పలువురి మన్ననలు అందుకున్నారు.
ఓ గాయనిగా, సంగీత దర్శకురాలిగా, స్టూడియో యజమానిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, రచరుత్రిగా పలు పాత్రలు సమర్ధవంతంగా నిర్వర్తించి శభాష్ అనిపించుకున్నారు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ పురస్కారాన్ని అందుకోవడంతో ప్రారంభమైన భానుమతి అవార్డుల పరంపర మూడు సార్లు జాతీయ అవార్డులు (అన్నై అను తమిళ సినిమాకు, అంతస్తులు, పల్నాటి యుద్ధం అనే తెలుగు సినిమాలకు) అందుకున్నారు. అన్నాదురై నడిప్పుకు ఇళక్కనం (నటనకు వ్యాకరణం) అని బిరుదు ఇచ్చి గౌరవించారు. తమిళ అభిమానులు అష్టావధాని అని కీర్తిస్తూ, ఈమె బహుముఖ ప్రజ్ఞను తలచుకుంటూ ఉంటారు. 1966లో ఆమె రాసిన అత్తగారి కథలు అను హాస్యకథల సంపుటికిగాను పద్మశ్రీ బిరుదు ఇచ్చి, భారత ప్రభుత్వం ఈమెను సత్కరించింది. ఇదే సంపుటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డు కూడా వచ్చింది.
1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు కళా ప్రపూర్ణ ఇచ్చి సత్కరించింది. 1984లో కలైమామణి బిరుదుతో తమిళనాడులోని ఐయ్యల్ నాటక మన్రం సత్కరించింది. బహుకళా ధీరతి శ్రీమతి అనే బిరుదుతో 1984లో లయన్స్ క్లబ్బు సత్కరించింది. 1984లో తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో సత్కరించింది. 1986లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును ఇచ్చింది. 1986లో ఉత్తమ దర్శకురాలిగా అవార్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అందుకున్నారు. 2013లో భారత సినీ పరిశ్రమ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలరున 50 ప్రముఖ చలనచిత్ర కళాకారుల తపాలాబిళ్ళలలో ఒకటి భానుమతిది.


