బ్రిటీష్ ఇండియాలో ఆఖరి పెద్ద సామ్రాజ్యం
సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలిచే భారతదేశంలో సిక్ఖు సామ్రాజ్యానికి ఉన్న ప్రాధాన్యత మామూలుది కాదు. పంజాబ్, దాని సమీప ప్రాంతాలను కలుపుకుంటూ మతరహిత రాజ్యాన్ని స్థాపించిన మహారాజా రంజీత్ సింగ్ నాయకత్వంలో 19వ శతాబ్దిలో భారత ఉపఖండంలో ఏర్పడ్డ ప్రధాన రాజకీయ శక్తి. 1799లో రంజిత్ సింగ్ లాహోర్ను పట్టుకున్న నాటి నుంచీ 1849 వరకూ కొనసాగింది. స్వతంత్ర మిస్ల్లు, ఖల్సాలో సామ్రాజ్యపు పునాదులు పాదుకున్నాయి. 19వ శతాబ్దిలో అత్యున్నత స్థితిలో ఉండగా సామ్రాజ్యం పడమట ఖైబర్ కనుమ నుంచి తూర్పున పశ్చిమ టిబెట్ వరకూ, దక్షిణాన మిథన్ కోట్ నుంచీ ఉత్తరాన కాశ్మీర్ వరకూ విస్తరించింది.
సిక్ఖు సామ్రాజ్యం బ్రిటీష్ వారు భారత ఉపఖండంలో ఆక్రమించిన ఆఖరి ప్రధానమైన భాగం. సిక్ఖు సామ్రాజ్యపు పునాదులు 1707లో ఔరంగజేబు మరణం, ముఘల్ సామ్రాజ్య పతనం నుంచి చూడవచ్చు. గురు గోవింద్ సింగ్ ప్రారంభించిన ఖల్సా మరో రూపమైన దాల్ ఖల్సా ఒకవైపు ముఘల్ సామ్రాజ్యం చెప్పుకోదగ్గ విధంగా బలహీన పడిపోవడంతో పశ్చిమాన ఆఫ్ఘాన్లపై దండయాత్రలతో పోరాటం సాగించారు. ఆ క్రమంలో ఈ సైన్యాలు విస్తరించి, విడిపోయి వివిధ సమాఖ్యలు, పాక్షికంగా స్వతంత్రత కలిగిన మిస్ల్ల స్థాపన సాగింది. వివిధ ప్రాంతాలు, నగరాలను ఈ సైన్య విభాగాలు నియంత్రించడం ప్రారంభించాయి. ఏదేమైనా 1762 నుంచి 1799 వరకూ మిస్ల్ల సైన్యాధ్యక్షులు స్వతంత్ర సైనిక నాయకులుగా రూపాంతరం చెందారు. లాహోరును రంజీత్ సింగ్ ఆఫ్ఘాన్ పరిపాలకుడు జమాన్ షా అబ్దాలీ నుంచి గెలుచుకుని, ఆఫ్ఘాన్-సిక్ఖు యుద్ధాల్లో ఆఫ్ఘాన్లను ఓడించి బయటకు పంపేయడం, వివిధ సిక్ఖు మిస్ల్ ను ఏకీకరణ చేయడంతో సామ్రాజ్య స్థాపన జరిగింది.
12 ఏప్రిల్ 1801న వైశాఖి పండుగ నాడు పంజాబ్ మహారాజాగా ప్రకటించుకుని, ఏకీకృతమైన రాజ్యంగా ప్రకటించారు. గురు నానక్ వంశస్తులైన సాహఙబ్ సింగ్ బేడీ పట్టాభిషేకం జరిపించారు. ఒక మిస్ల్కు నాయకుని స్థానం నుంచి పంజాబ్ మహారాజా అయ్యేంతవరకూ రంజిత్ సింగ్ అతికొద్ది కాలంలోనే అధికారం సంపాదించారు. అప్పటికి ఆధునికమైన ఆయుధాలు, యుద్ధ పరికరాలు, శిక్షణ సమకూర్చి సైన్యాన్ని ఆధునీకరించారు. సిక్ఖు సామ్రాజ్య కాలంలో సిక్ఖులు కళారంగంలోనూ, విద్యాల్లోనూ పునరుజ్జీవనం పొందారు. రంజిత్ సింగ్ మరణానంతరం అంతర్గత కుమ్ములాటల్లోనూ, రాజకీయమైన తప్పులతోనూ సామ్రాజ్యం బలహీనపడింది. చిరవకు 1849లో ఆంగ్లో-సిక్ఖు యుద్ధాల్లో ఓటమి అనంతరం సామ్రాజ్యం పతనమైంది. సిక్ఖు సామ్రాజ్యం 1799 నుంచి 1849 కాలంలో లాహోర్, ముల్తాన్, పెషావర్, కాశ్మీర్ ప్రావిన్సులుగా ఉండేది.
జాన్ రే గ్రీషమ్ అమెరికాలో పేరెన్నిక గల నవలా రచయిత. ఒకవైపు రచనలు చేస్తూనే రాజకీయవేత్తగా, న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా కూడా తనదైన పాత్రను పోషించారు. ఇతని పుస్తకాలు దాదాపు 42 ప్రపంచ భాషల్లో అనువాదమయ్యాయి.గ్రీషమ్ నవలలు అనేకం లీగల్ థ్రిలర్స్గా చెలామణీ అయ్యాయి. మిసిసిపీ స్టేట్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన గ్రీషమ్ తర్వాత న్యాయశాస్త్రంలో కూడా డిగ్రీని పొందారు. క్రిమినల్ లాయర్గా గుర్తింపునూ పొందారు. 1984లో తన తొలి నవల ‘ఏ టైమ్ టు కిల్’ను రాశారు. 1989లో ప్రచురణకు నోచుకున్న ఈ పుస్తకం 2012 నాటికి ప్రపంచవ్యాప్తంగా 275 మిలియన్ల కాపీలు అమ్ముడుపోయింది. అమెరికాలో తొలి పుస్తకమే 2 మిలియన్ల కాపీలు అమ్ముడైన రచయితలు ముగ్గురే ముగ్గురు. అందులో టామ్ క్లాన్సీ, జేకే రౌలింగ్లతో పాటు గ్రీషమ్ కూడా ఒకరు.
1991లో గ్రీషమ్ రాసిన ‘ది ఫర్మ్’ 7 మిలియన్ల కాపీలు అమ్ముడైపోయి రికార్డు నమోదు చేసింది. 1993లో ఇదే నవలను ఇదే పేరుతో టామ్ క్రూజ్ కథానాయకుడిగా సినిమాగా తెరకెక్కించారు.గ్రీషమ్ నవలల్లో సినిమాలుగా తెరకెక్కినవాటిలో ది ఛాంబర్, ది క్లైంట్, ఏ పెయింటెడ్ హౌస్, ది పెలికన్ బ్రీఫ్, స్కిప్పింగ్ క్రిస్మస్, ది రెయిన్ మేకర్, ది రన్ అవే జ్యూరీ మొదలైన వాటిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. జాన్ గ్రీషమ్ అమెరికాలోని అర్కన్సాస్లో ఒక పత్తిరైతు కుటుంబంలో జన్మించాడు. గ్రీషమ్కు నాలుగేళ్లు ఉన్నప్పుడే అతని కుటుంబం మిసిసిపీకి తరలిపోయింది. చిన్నప్పటి నుండీ జాన్కు బేస్బాల్ ఆటగాడు అవ్వాలన్నదే లక్ష్యం. ది పెయింటెడ్ హౌస్ నవలలోని ఘట్టాలన్నీ కూడా గ్రీషమ్ తన బాల్యం ఆధారంగానే రాయడం జరిగింది. కాలేజీ పూర్తయ్యాక గ్రీషమ్ ఎన్నో ఉద్యోగాలు మారాడు.
ఒక డిపార్టుమెంటల్ స్టోరులో అండర్ వేర్లు అమ్మే వ్యక్తిగా తను పడిన కష్టాల గురించి కూడా గ్రీషమ్ అనేక ఇంటర్వ్యూలలో పేర్కొన్నాడు. తర్వాత ట్యాక్స్ లాయర్గా కెరీర్ ప్రారంభించాలనుకున్నా అతని చదువు సజావుగా సాగలేదు. కోర్సు పూర్తి చేయడానికి మూడు కాలేజీలు మారాల్సి వచ్చింది. లాయర్గా మంచి పేరు, ప్రఖ్యాతులు గడించాక గ్రీషమ్ స్థానిక ఎన్నికల్లో డెమోక్రాట్గా పోటీ చేసి గెలిచాడు. ఆ పదవిలో 1983 నుండి 1990 వరకు ఉన్నాడు. ది ఫర్మ్ – నవల విడుదలై రికార్డు సాధించే వరకూ తను న్యాయవాదిగా కేసులు వాదించేవాడు. ది టైమ్ టు కిల్ పేరుతో గ్రీషమ్ రాసిన నవల వెనుక కూడా ఒక విషాదభరితమైన కథ ఉంది. ఒకసారి కోర్టు బయట తను తచ్చాడుతుండగా ఓ 12 ఏళ్ల అమ్మాయి వచ్చి తనను ఎలా కొందరు ముష్కరులు రేప్ చేసి, చిత్రహింసలు పెట్టారో చెప్పినప్పుడు గ్రీషమ్ మనసు ద్రవించింది.
అదే అంశాన్ని సబ్జెక్టుగా తీసుకొని, ఒకవేళ ఆ అమ్మాయి తండ్రి ఆ ముష్కరులను తుదముట్టడించడానికి ప్లాన్ వేస్తే, ఎలాగుంటుంది అన్న ప్లాట్తో రాసిన నవలే ‘ది టైమ్ టు కిల్’. దాదాపు 28 మంది ప్రచురణకర్తలు ఆ నవలను ముద్రించడానికి ముందుకు రాలేదు. ఓ అపరిచిత పబ్లిషర్ ఓ 5000 కాపీలు మాత్రమే వేయడానికి ముందుకొచ్చాడు. రచయితగా కెరీర్ గ్రీషమ్ నవల ‘ది ఫర్మ్’ విజయవంతమయ్యాక తను వెనక్కి తిరిగి చూసుకొనే పరిస్థితి రాలేదు. తర్వాత తాను రాసిన అన్నీ నవలలూ దాదాపుగా బెస్ట్ సెల్లర్స్గానే కితాబునందుకున్నాయి. బేస్ బాల్ క్రీడను అభిమానించే గ్రీషమ్ 2004లో ఆ క్రీడానేపథ్యంతో ‘మిక్కీ’ అనే చిత్రాన్ని నిర్మించారు. దానికి స్క్రీన్ ప్లే కూడా సమకూర్చారు. 2010 నుండి గ్రీషమ్ 9-12 ఏళ్ల పిల్లల కోసం లీగల్ థ్రిల్లర్స్ రాయడం మొదలుపెట్టారు. 2006లో చార్లీ రోజ్ షో అనే ఒక టాక్ షోలో గ్రీషమ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తను సాధారణంగా ఒక పుస్తకాన్ని రాయడానికి 6 నెలలు తీసుకుంటానని చెప్పారు.
తన అభిమాన రచయిత జాన్ లీ కారే అని కూడా పేర్కొన్నారు. వ్యక్తిగత జీవితం – గ్రీషమ్ మే 8, 1981లో రీనీ జోన్స్ను వివాహమాడారు. వీరికి ఇద్దరు పిల్లలు. 2005 పెగ్గీ వి హెల్మిర్చ్ స్మారక పురస్కారం. 2007 గ్యాలక్సీ బ్రిటీష్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం, 2009 కాల్పనిక సాహిత్యంలో చేస్తున్న సేవకు గాను లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ క్రియేటివ్ అచీవ్మెంట్ అవార్డు, 2014 స్కామోర్రో నవలకు లీగల్ ఫిక్షన్ విభాగంలో హార్పర్ లీ పురస్కారం అందుకున్నారు.


