భక్తుల రద్తీకి అనుగుణంగా ‘యాదాద్రి’లో ఏర్పాట్లు
- 104 Views
- wadminw
- September 5, 2016
- రాష్ట్రీయం
యాదాద్రిని అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నందున రాబోయే కాలంలో భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉన్నందున రద్దీకి అనుగుణంగా యాదగిరిగుట్టలో ఏర్పాట్లు చేయాలిని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. యాదాద్రి అభివృద్ధి పనులను క్యాంపు కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రి సమీక్షించారు.
మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, వైటీడీఏ స్పెషల్ ఆఫీసర్ కిషన్రావు ఆలయాశిల్పులు ఆనంద్ సాయి, ప్రవీణ్, ఇంజనీరింగ్ అధికారులు వెంకటేశ్వర్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నార. ప్రధాన ఆలయముండే గుట్టకు అభిముఖంగా ఉన్న గుట్టలతో కూడుకున్న ప్రాంతాన్ని టెంపుల్ సిటీగా మార్చేందుకు నిర్ణయించిన నేపథ్యంలో దానికి సంబంధించిన లే-అవుట్లు, డిజైన్లును ముఖ్యమంత్రి పరిశీలించారు. టెంపుల్ సిటీని 850 ఎకరాల విశాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇందులో కాటేజీలు, విశాలమైన రోడ్లు, పార్కింగ్, ఉద్యానవనాలు, పుట్పాత్లు, ఫుడ్కోర్టులు, ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో 250 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టాల్సిన పనుల నమూనాలను ఖరారు చేశారు. 86 ఎకరాల విస్తీర్ణంలో 200 కాటేజీలు, మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఫుడ్ కోర్టులు, 7 ఎకరాల విస్తీర్ణంలో మంచినీరు, మరుగు నీటి నిర్వహణ వ్యవస్థ, 12 ఎకరాల్లో గ్రీనరీ, 62 ఎకరాల్లో రహదారులు, 26 ఎకరాల్లో ల్యాండ్ స్కేపింగ్ చేయడంతో పాటు మరో 42 ఎకరాల గుట్ట ప్రాంతాన్ని ప్రకృతి రమణీయంగా తీర్చిదిద్దాలని సిఎం నిర్ణయించారు. యాదాద్రిలో కాటేజీలు నిర్మించడానికి ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణి, జెన్కోలతో పాటు దేశ వ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలు ముందుకొస్తున్నాయి. వారికి కేటాయించడానికి 1000-1500 గజాల ఓపెన్ ప్లాట్లను వెంటనే సిద్ధం చేయాలని సిఎం చెప్పారు.
కాటేజీలు నిర్మించే ప్రాంతంలో రహదారులు, మురుగునీరు, విద్యుత్, మంచినీటి తదితర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రధాన ఆలయానికి వెళ్ళడానికి, రావడానికి రెండు వేర్వేరు రహదారులు నిర్మించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న దారిని గుట్ట పైకి వెళ్లడానికి ఉపయోగించాలని, కిందికి రావడానికి మరో రహదారి నిర్మిస్తున్నామని వెల్లడించారు.
భక్తులను గుట్టపైకి తీసుకెళ్లడానికి ఆలయం తరుపున ప్రత్యేక రవాణా సదుపాయం కూడా కల్పించే యోచనలో ఉందని సిఎం వెల్లడించారు గుట్టపైన నిర్మాణాలను కూడా సిఎం సమీక్షించారు. యాదాద్రి పూర్తిస్థాయి నిర్మాణాలు పూర్తయిన తర్వాత నిర్వహణ బాధ్యతలు చూసేందుకు అవసరమైన వ్యూహం ఖరారు చేయాలని సిఎం చెప్పారు. యాదాద్రి పనులను నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎం ఆదేశించారు.


