మహానటి సావిత్రి ఒక నిజమైన లెజండ్
జగతి మరువలేని నటి సావిత్రి. ఆమే నటనాకౌశలం ఒక అపూర్వ గ్రంధాలయం. ఎన్ని తరాలు మారినా ఆమె జీవించిన చిత్ర రాజాలు ఆంధ్రుల మదిలో ఎన్నటికీ నిలిచే ఉంటారు. అమెని తెలుగు చిత్ర రంగంలో తిరుగులేని నటీమణిగా నిలబెట్టారు. సావిత్రి పుట్టిననెల గిట్టిన నెల డిసెంబరు మాసం కావటం కాకతాళీయం. జననం డిసెంబరు 6,1937 – మరణం డిసెంబరు 26, 1981 (శనివారం). ఆమె జీవిత కాలం కేవలం 44 సంవత్సరాలు మాత్రమే. గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో డిసెంబరు 6న నిస్సాంకురమ్ గురవయ్య, సుభద్రమ్మలకు జన్నించారు. నాట్యంలోనూ, సంగీతంలోనూ ప్రవీణ్యురాలై, ఎన్నో ప్రదర్శనలిచ్చారు.
నందమూరి తారకరామారావు, జగ్గయ్య వంటి మహా నటులు ఆరోజుల్లో నడిపిన నాటక ప్రదర్శనలలోనూ స్టేజీమీద ప్రదర్శనలిచ్చారు. తరువాత కాలంలో నవభారత నాట్యమండలి అనే నాటక కంపెనీ స్ధాపించారు. బుజ్జిబాబు రచించిన ఆత్మ వంచన నాటకం ప్రదర్శన ప్రసిద్ధి చెందింది. 12 సంవత్సరాల వయస్సులో మద్రాసు చేరిన ఆమె సినిమాలలో ప్రయత్నం చేశారు. తెలుగులో తొలి అవకాశం యల్.వి.ప్రసాద్ గారి ”సంసారం” సినిమాలో లభించింది. 1949లో అగ్ని పరీక్షలో అవకాశం వచ్చినా అప్పటికి ఆమె చిన్న పిల్లని, మెచ్యూరిటీ లేక ఆపాత్రకి సరిపోదని ఆ సినిమాలో ఆమెను ఎంపిక చేయలేదు. అనంతరం పాతాళభైరవి చిత్రంలో నృత్యపాత్రలో కనిపించారు.
అలా చిన్న చిన్న పాత్రలతో ప్రారంభమైన ఆమె నట జీవితం పెళ్ళిచేసి చూడు, అర్ధాంగి, మిస్సమ్మ ఇలా ఎన్నో సినిమాలతో ఎదిగి, మంచి నటిగా గుర్తింపు తెచ్చిపెట్టింది. మహానటిగా నిలబెట్టింది. ఆమె తెలుగుతో పాటు తమిళ సినిమాలలోనూ తిరుగులేని నటీమణి. ఆమె తొలుత ప్రముఖ తమిళ హీరో జెమినీగణేష్ తోనూ, శివాజీ గణేశన్ తోనూ అనేక చిత్రాలలో నటించారు. మనంపోల మాంగల్యమ్(1953) తమిళ సినిమాలో ఆమె నటించారు. హీరో జెమినీ గణేష్. ఆ సమయంలోనే ప్రేమ మత్తులో పడి 1953లోనే ఆమె జెమినీ గణేష్ ని వివాహం చేసుకున్నారు. కూతురు విజయ చాముండేశ్వరి, కొడుకు సతీష్లను చాలా స్ట్రిక్ట్గా డిసిప్లిన్తో పెంచారు.
టి.వి.లు లేని ఆరోజుల్లో 16ఎం.ఎం. ప్రొజెక్టర్ పెట్టి ఇంట్లోనే సినిమాలు చూసేవారు. అడిగినవారికి లేదనకుండా దానమిచ్చే దానశీలి సావిత్రి. లాల్ బహుదూర్ శాస్తిగారి సమక్షంలో తన వంటిమీదున్న నగలని ప్రధాన మంత్రి సహాయ నిధికి దానమిచ్చారు. ఆమె సంపాదనలో అధిక భాగం దానాలకే ఖర్చయ్యేది. అందరినీ నమ్మేవారు. ఆమెకి క్రికెట్ అన్నా, ఛెస్ అటలంటే ప్రీతి. ఆమెకి ఎడమచేతి వాటం ఎక్కువ. పిల్లలని ప్రేమతో చూసుకునేవారు. తెరపైన, తెర వెనుక కూడా అనేక పాత్రలతో అశేష ప్రజానీకాన్ని అలరించిన సావిత్రి తెలుగు సినీ సామ్రాజ్ఞి. సినీ జీవితంలో అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినా,నిజ జీవితంలో అతిఘోరంగా విఫలమైయ్యరు.
చిన్నవయసులోనే మృత్యువుతో పోరాడిన ఆమె జీవిత చరమాంకం అందరికీ ఒక పాఠం. ఆమె నటజీవితం ఎందరో నటీమణులకి మార్గదర్శకం. కాగా, తెరపైన, తెర వెనుక కూడా అనేక పాత్రలతో అశేష ప్రజానీకాన్నిఅలరించారు మహానటి సావిత్రి. తెలుగు వారు మరచిపోలేని పాత్ర దేవదాసులోని పారు. ఇఫ్పటికీ వన్నె తరగని చిత్రమది. అలాగే మాయాబజార్లోని శశిరేఖ పాత్ర. ఇప్పటికీ అహనా పెళ్ళంట… పాటని ఆ సన్నివేశాన్ని ఎవరూ మరువలేరు. చూపులతో, పెదవి కదలికలతో, తన నటనతో ఎందరినో మంత్రముగ్ధులను చేశారు ఆమె. నర్తనశాల, శ్రీకృష్ణపాండవీయం, సుమంగళి, నాదీ ఆడజన్మే, నవరాత్రి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలు ఆమె నటనాకౌశలానికి దీపికలు.
దొంగరాముడు, తోడికోడళ్ళు, అభిమానం, మురిపించేమువ్వలు(1960), మంచిమనసులు(1961), డాక్టర్ చక్రవర్తి (1964), దేవత(1965), మనసే మందిరం (1971) వంటి అనేక చిత్రాలు ఆమె నటనకి మైలు రాళ్ళు. తెలుగు తమిళ, హిందీ చిత్రాలన్నిటిలో కలిపి 318 సినిమాలలో నటించారు. హిందీలో బహుత్ దిన్ హుమై, ఘర్ బసాకే దేఖో, బలరామ్ శ్రీకృష్ణ, గంగాకి లహరే మొదలైన చిత్రాలు చేశారు. సావిత్రిని దక్షిణాది మీనాకుమారిగా అభివర్ణించేవారు.


