మినరల్ వాటర్ కంటే జనరల్ వాటరే మంచిదట!
పరిశుభ్రంగా ఉంటే మినరల్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కంటే కూడా జనరల్ వాటరే (సాధారణ నీళ్లే) ఆరోగ్యానికి మేలని ఈమధ్య పరిశోధనలు స్పష్టంచేస్తున్నాయి. ఒకప్పుడు ఏ ఇంటి ముందు ఆగి కాస్త దాహం తీర్చమంటే రాగి చెంబుతో నీళ్ళు ఇచ్చేవారు. ఇపుడు కనీసం హోటల్లోనూ తాగడానికి పరిశుభ్రమైన నీరు దొరకడం లేదు. అందుకే అంతా మినరల్ వాటర్ బాటిళ్ళు కొనుక్కోవాల్సిన దుస్థితి వస్తోంది. ఇక మనం నీరు తాగే ముందు అది మినరల్ వాటరేనా అని ఆలోచించడం కామన్ అయిపోయింది. ఏవేవో యంత్రాల ద్వారా శుద్ధి చేసిన మినరల్ వాటర్ని కొని అవే మంచివని లీటర్ 4 రూపాయల నుండి 25 రూపాయలు వరకు ఖర్చు పెడుతున్నాం.
కిన్లే లాంటి పెద్ద వ్యాపార సంస్థలు లీటర్ 20 రూపాయలకు నీరు అమ్ముతున్నాయి. కానీ, వాటిలో స్వచ్చత ఉందా అనే సందేహం చాలామందిలో ఉంది. కానీ, ఈమధ్య చేసిన సర్వేలలో తేలిన విషయం ఏమంటే నీళ్ళలో ఒక కెమికల్ కలిపి వాటిని మినరల్ వాటర్లా అమ్ముతున్నారు. దీనివలన ప్రమాదమే కానీ, ఉపయోగం మాత్రం ఎంతమాత్రం లేదని తేలింది. రుచి (టేస్ట్) కోసం రకరకాల రసాయనాలను కలిపి తయారుచేస్తున్న నీళ్లను తాగి రోగాలని కొనుక్కొని తెచ్చుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. ఇదంతా ఎందుకు చేస్తున్నారని అంటే ఆరోగ్యం కోసం అంటారు అందరూ.
రోగాల బారిన పడకూడదు అనుకుంటూనే, రోగాలని కొనుక్కుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే బయట మార్కెట్లో కొనే మినరల్ వాటర్ వలన మన శరీరంలో ఎముకల చుట్టూ ఉండే కాల్షియం కరిగిపోయి ఎముకలు డొల్ల అవుతున్నాయట. దీనివలన ఎముక పటుత్వం కోల్పోయి చిన్న చిన్న సంఘటనలకే విరిగిపోతున్నాయట. ఈ బాటిళ్ళ వినియోగం మన సంస్కృతి కాదు.
భారతదేశంలో ఉన్న మన పూర్వికులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మన ఆరోగ్యం కోసం కొన్ని సూత్రాలు చెప్పారు. అందులో ఇది ఒకటి. నీటిని శుబ్రపరిచేందుకు రాగి, ఇత్తడి బిందెలు, చెంబులు వాడేవారు. వీటిని వాడటం వలన నీటిలో ఉండే సూక్ష్మక్రిములు చనిపోతాయి.
ఈ మధ్య జరిగిన ఒక ప్రయోగంలో రోబ్ రీడ్ అనే శాస్త్రవేత్త ప్లాస్టిక్ పాత్రలు, మట్టి పాత్రలు, ఇత్తడి, రాగి పాత్రలలో విరోచనకారి అయిన ఒక సూక్ష్మక్రిమిని వేశారు. దీనిని 24 గంటల తరువాత పరిశీలించగా, ఇత్తడి రాగి పాత్రలలో వేసిన క్రిములు శాతం తగ్గింది. మరల 48 గంటల తరువాత పరిశీలించగా, రాగి, ఇత్తడి పాత్రలలో క్రిములు 99 శాతం నశించిపోయాయి. కాని ప్లాస్టిక్, ఇతర పాత్రలలో వేసిన క్రిమి 24 గంటలకి రెట్టింపు అయింది. 48 గంటలకి దానికి రెట్టింపు అయిందని కనుగొన్నారు.
ఈమధ్య కాలంలో అనేక స్టార్ హోటల్స్లో రాగి పాత్రలని వాడుతున్నారు. ఎందుకంటే వారి కష్టమర్స్ ఆరోగ్యం వారికి ముఖ్యం కదా. రాగి, ఇత్తడి పాత్రలను వాడండి. పరిశుభ్రమైన నీరు తాగండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. రాత్రి పూట రాగి చెంబులో నీళ్ళు నిలువ చేసి పరకడుపున తాగడం వల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయట. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుందని కూడా ఆయుర్వేధంలో చెప్పబడింది.
మెదడు శక్తివంతంగా తయారవుతుంది. థైరాయిడ్ గ్రంధి పనితీరు క్రమపడుతుంది. రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. రాగి పాత్రలను నిత్యం ఉపయోగంచడం వల్ల ఎముకల పటుత్వం పెరుగుతుంది. ఎముకలు దృఢంగా, ఆరోగ్యవంతంగా తయారవుతాయి. రాగి పాత్రలలో వండిన వంటలను సేవించడం ద్వారా కాలేయం, మూత్రపిండాలు ఆరోగ్యవంతంగా పని చేస్తాయి.
చిన్న వయసులో జుట్టు తెల్లబడటం, చర్మం త్వరగా ముడతలు పడటం, వయస్సు పెరిగినట్లు కనిపించడం వంటి సమస్యలు దరిచేరకుండా నియంత్రిస్తాయి. ఊబకాయం, మలబద్దకం, గుండెపోటు వంటి సమస్యలకు మంచి ఔషదంగా పనిచేస్తుంది. రాగి కడియం ధరించడం వల్ల శరీరంలోని వేడిని తగ్గించి బి.పి, కొలెస్ట్రాల్ను అరికడుతుంది. రాగి బిందెలలో నీళ్ళు నిలువ చేసుకుని తాగడం వల్ల శరీరం బరువును పెంచే అనవసరమైన కొవ్వును బయటకు పంపేస్తుంది. రక్తప్రసరణను క్రమబద్దీకరించి మెదడును చురుకుగా పనిచేసేలా చేసి జ్ఞాపకశక్తిని వృద్ధి చేస్తుంది. ఎదిగే పిల్లలకు అది ఎంతో ఉపకరిస్తుంది.


