లోహ యుగం నాటి సమాధులే డాల్మెన్లు
- 166 Views
- wadminw
- September 3, 2016
- అంతర్జాతీయం
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండల పరిధిలోని దన్నన్నపేట వద్ద కొత్త రాతియుగం రాక్షస గూళ్ళు (డాల్మెన్) ఇది. రాతి పలకలతో పెట్టె వలె నిర్మించి, పైన మూత వలె పెద్ద రాతి పలకను ఉంచే లోహ యుగం నాటి సమాధులను డాల్మెన్లు అంటారు. కొత్త రాతియుగంలో మనిషి గుంపులు గుంపులుగా సంచారం జీవనం సాగించేవాడట. ఆ ఆదిమ తెగలు తమలో ఎవరైన చనిపోతే తమకు పునర్జన్మ ఉంటుందని భావించి చనిపోయిన శవాన్ని పెద్ద మట్టి కుంట తయారు చేసి అందులో పెట్టి ఆకులు, నారలతో చుట్టి దాన్ని భూమిలో పాతి పెట్టేవారు. ఆ తరువాత ఆ శవాన్ని ఏదీ పీక్క తినకుండా పెద్ద పెద్ద రాళ్లను చుట్టూ పెట్టేవారట. వీటిని పురావస్తు శాస్త్రవేత్తలు పాండవ గుళ్లు లేదా రాక్షస గూళ్ళు గా వ్యవహరిస్తారు. రాక్షస గూళ్లు బయల్పడటం, ఆయా ప్రాంతంలో పురాతన మానవ ఆవాసానికి ఆనవాళ్ళు.
చనిపోయినవారిని సమాధి చేసి పెద్దపెద్ద ప్రాకారాలు నిర్మించేవారు. ఆ సమాధుల్ని రాక్షస గుళ్లు అంటారు. ఈ భారీ అంత్యక్రియకు సంబంధించిన కట్టడాలు శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాల్లో తక్కువగా, మిగిలిన చోట్ల ఎక్కువగా ఉండేవి. రాయలసీమలో వీటిని నేటికీ పాండవ గుళ్లు అంటారు. కర్నూలు జిల్లా శంఖవరంలో గొర్రె ఆకారంలో, నల్గొండ జిల్లా ఏలేశ్వరంలో ఏనుగు ఆకారంలో విశేష నిర్మాణాలు బయల్పడినవి. పెద్ద పెద్ద బండరాళ్ళతో నిర్మించిన ఈ సమాధులు క్రీ.పూ.2000 నుండి క్రీ.పూ.500 సంవత్సరాల మధ్య కాలం నాటివిగా చరిత్రకారులు పేర్కొన్నారు. ఈ సమాధులలో మృతుల అస్థికలు గాని, మృతదేహాన్ని గాని ఉంచి వారికి సంబంధించిన వస్తువులను కూడా పూడ్చడం నాడు ఆచారంగా ఉండేది. పురాతత్వ శాస్త్రవేత్తలు వీటిని పరిశీలించి ఈ సమాధులలో బంగారు ఆభరణాలు, వేణువులు, ఇతర వస్తు సముదాయాలను బయల్పరిచారు. మృతి చెందిన వారితో పాటు వారి వస్తువులను కూడా సమాధులలో ఉంచితే అతని ఆత్మకు శాంతి కలుగుతుందని నాటి ప్రజల విశ్వాసం. సమాధుల చెంత స్మృతి చిహ్నాలుగా శిలాస్తంభాలు ఉంచేవారు.
ఇక్ష్వాకు వంశీయుల నాటి ఛాయా స్తంభాలు నాగార్జున కొండ వద్ద తవ్వకాలలో బయల్పరిచారు. ఈ సమాధుల్లోనూ రకాలు కలవు. అవి 1. డాల్మెన్లు, 2. సిస్త్లు ఈ రెండు రకాల సమాధులు తెలుగు నేల మీద వేల సంఖ్యలో ఉన్నట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ రెండు రకాల సమాధులకు పై కప్పు బండలకు రంధ్రములు ఏర్పరిచి ఉన్నవి. ఈ రంధ్రాల ద్వారా ప్రేతాత్మ సమాధి నుండి బయటికి వచ్చి సంచరించి, తిరిగి సమాధులలోకి పోతుందని ఆనాటి ప్రజల విశ్వాసం. శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస సమీపంలోని దన్నన్నపేట వద్ద మెగాలిథిక్ రాక్షస గుడి స్థానికంగా విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. రాతి పలకలతో పెట్టె వలె నిర్మించి, పైన మూత వలె పెద్ద రాతి పలకను ఉంచెడి లోహ యుగం నాటి సమాధులను డాల్మెన్లు అంటారు. రాతి పలకకు ఒకవైపు పెద్ద రంధ్రం ఏర్పాటు చేస్తారు. ఈ రాతి పెట్టెను భూమి ఉపరి భాగంలో ఉంచి, శవంతో పాటు, మృతుడు వాడిన వస్తువులను అందులో ఉంచి పైన రాతి పలకను ఉంచెడివారు. ఇక, పెద్ద గోయి తీసి రాతి పలకలతో సిద్ధపరచిన పెట్టెను శవంతో పాటు భూస్థాపితం చేసి, చుట్టూ వృత్తాకారంలో పెద్ద పెద్ద రాతిగుండ్లను పేర్చి సురక్షితమొనర్చిన సమాధులను సిస్త్లు అని అంటారు.


