సీఎం క్యాంపు కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
హైదరాబాద్, అక్టోబబర్ 5 (న్యూస్టైమ్): తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారి క్యాంపు కార్యాలయం ఉయ్యాల పాటలతో మార్మోగింది. తెలంగాణ పూల పండుగ సిఎం అధికారిక నివాసంలో సందడి చేసింది. తెలంగాణతో పాటు ముంబయ్, సూరత్, ఢిల్లీలో అదేవిధంగా విదేశాల్లోనూ అంగరంగ వైభవంగా కొనసాగుతున్న తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ నేడు బేగంపేట్లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కన్నుల పండువగా జరిగింది.
ఆద్యంతం ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సతీమణీ శోభ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితతో పాటు డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, మంత్రుల సతీమణులు సునీత జగదీష్ రెడ్డి, ఈటెల జమున, తన్నీరు శ్రీనిత హరీష్ రావు, కల్వకుంట్ల శైలిమ రామారావు, అల్లోల విజయ లక్ష్మీ, చెర్లకోల శ్వేతా లక్ష్మారెడ్డి, తలసాని స్వర్ణతో పాటు రంగారెడ్డి, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్లు సునీత మహేందర్ రెడ్డి, తూల ఉమతో పాటు సిఎం కుటుంబ సభ్యులు, బంధువులు, క్యాంపు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ‘‘పొదల పొదల గట్ల నడుమ నాగమల్లేదారిలో’’ అంటు క్యాంపు కార్యాలయ మహిళా సిబ్బందితో కలిసి సిఎం సతీమణి, ఎంపి కవిత, మంత్రుల సతీమణులు ఆడి పాడారు. గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.
అంతకు ముందు ఉదయం బతుకమ్మలను పాటలు పాడుతూ ఉత్సాహ పూరిత వాతావరణంలో పేర్చారు. సిఎం క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో జరిగిన బతుకమ్మ వేడుకలను మంత్రి కెటి. రామారావు కాసేపు ఆసక్తిగా తిలకించారు.


