హోమియోపతి వైద్యంపై చెరగని మచ్చ!
- 90 Views
- wadminw
- September 21, 2016
- అంతర్జాతీయం
అల్లోపతి కంటే హోమియోపతీ వైద్యం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న వైద్య పద్ధతి. ముఖ్యంగా భారతదేశంలో దీనికి లభిస్తూన్న ప్రజాదరణ, తదౄపేణా ప్రభుత్వాదరణ, ప్రపంచంలో మరెక్కడా లేదనటం అతిశయోక్తి కాదు. ఈ పద్ధతి దరిదాపు రెండు వందల ఏళ్ళబట్టీ వాడుకలో ఉన్నప్పటికీ దీనికి శాస్త్రీయమైన పునాదులు లేవనే నింద ఒక చెరగని మచ్చలా ఉండిపోయింది. ఆధునిక శాస్త్రీయ దృక్పధంతో చూస్తే ఈ నిందారోపణ సబబయినదే అనిపిస్తుంది. కాని హోమియోపతీ వైద్యం వల్ల వ్యాధి నయమైన వారు ముందుకు వచ్చి ఇచ్చే సాక్ష్యం సంగతి ఏమిటని ప్రతి సవాలు చేసేవారూ ఉన్నారు. హోమియోపతీ అన్నది హోమోయిస్ (ఒకే రకమైన), పేథోస్ (బాధ, రోగ లక్షణం) అనే రెండు గ్రీకు మాటలని సంధించగా పుట్టిన మాట. కనుక కావలిస్తే దీనిని తెలుగులో సారూప్య లక్షణ వైద్యం అనొచ్చు.
ఉష్ణం ఉష్ణేత శీతలే అన్నట్లు, వజ్రం వజ్రేనభిద్యతే అన్నట్లు ఒక పదార్ధం ఏ బాధని కలిగిస్తుందో ఆ బాధని నివారించటానికి అదే పదార్ధాన్ని మందుగా వాడాలి అన్నది హోమియోపతీ మూల సూత్రం. ఈ వైద్యపద్ధతిని, ఈ మాటని కనిపెట్టినది సేమ్యూల్ హానిమాన్ (1755-1843) అనే జెర్మనీ దేశపు వైద్యుడు. ఈయన వైద్య కళాశాలకి వెళ్ళి లక్షణంగా అప్పటి వైద్యశాస్త్రం అధ్యయనం చేశాడు. ఆ రోజులలో వైద్యం అంటే నాటు వైద్యమే. రోగానికి కారణం మలినపు రక్తం అనే నమ్మకంతో రోగి రక్తనాళాలని కోసి రక్తం ఓడ్చేసేవారు. దేహనిర్మాణశాస్త్రం (ఎనాటవిూ), రోగనిర్ణయశాస్త్రం, రసాయనశాస్త్రం అప్పటికి ఇంకా బాగా పుంజుకోలేదు. కనుక అప్పటి వైద్య విధానాలలో హానిమాన్కి లోపాలు కనిపించటం సహజం.
ఈ లోపాలని సవరించటానికి ఆయన ఒక కొత్త పద్ధతిని కనిపెట్టేడు. అదే ¬మియోపతీ. హోమియోపతీ వాడుకలోకి వచ్చిన తరువాత హోమియోపతీ భక్తులు ఇప్పుడు వాడుకలో ఉన్న ఇంగ్లీషు వైద్యాన్ని అల్లోపతీ అనటం మొదలు పెట్టేరు. అంతేకాని ఇంగ్లీషు వైద్యులు ఎవ్వరూ వారి వైద్యపద్ధతిని అల్లోపతీ అని అనరు. దరిదాపు రెండున్నర శతాబ్దాల క్రితం పుట్టిన ఈ పద్ధతి కాలక్రమేణా కొన్ని మార్పులు చెందింది. మొదట్లో హానిమాన్ ప్రవచించిన పద్ధతిని సనాతన హోమియోపతీ అనీ, ఇప్పుడు వాడుకలో ఉన్న పద్ధతిని అధునాతన హోమియోపతీ అనీ అందాం. కాని ఇక్కడ విచారణ చేసేది ముఖ్యంగా సనాతన పద్ధతి గురించే. హోమియోపతీ వైద్యానికి కొన్ని మూల సూత్రాలు ఉన్నాయి. మొదటి సూత్రం. మనం ఇచ్చే మందు రోగానికి, రోగ లక్షణాలని తగ్గించటానికి కాదు; మనిషికి.
ఒకే రోగం అందరిలోనూ ఒకే లక్షణాలని చూపించదనేది సర్వులూ గమనిస్తూన్న విషయమే. ఇది పటిష్టమైన సూత్రమే అని మానసిక శాస్త్రంలో ప్రావీణ్యత ఉన్నవారు ఒప్పుకుంటున్నారు. ఈ సూత్రానికి మైండ్ ఓవర్ మేటర్ అని ఇంగ్లీషులో భాష్యం చెప్పొచ్చు. కనుక రోగి ఎన్ని లక్షణాలు ఏకరవు పెట్టినా వాటన్నిటికి ఒకే ఒక మూల కారణం ఉంటుందనేది వీరి సిద్ధాంతం. కనుక రోగి ఎన్ని లక్షణాలు ఏకరవు పెట్టినా వాటన్నిటికి ఒకే ఒక మందు (రెమిడీ) ఇస్తారు. సనాతన హోమియోపతీలో మందుల ఖాతాలో ఉన్న ఏ మందు ఏ రోగికి నప్పుతుందో ఎంపిక చెయ్యటం చాల కష్టం. పది పుస్తకాలు చదివినంత మాత్రాన అబ్బే ప్రతిభ కాదు ఇది; అనుభవం ఉండాలి. అందుకనే హ్పమియోపతీ వైద్యం అందరి చేతిలోనూ రాణించదు. అందుకనే కాబోలు, అధునాతనులు ఈ సూత్రాన్ని సమయానుకూలంగా విస్మరిస్తారు. రెండవ సూత్రం.
రోగికి ఏ మందు ఇవ్వాలనే ప్రశ్నకి సమాధానం చెబుతుంది ఈ సూత్రం. ఆరోగ్యంగా ఉన్న ఒక వ్యక్తి చేత ఏదైనా మందు తినిపించినప్పుడు ఆ వ్యక్తి శరీరంలో ఏయే లక్షణాలు పొడచూపుతాయో అయా లక్షణాలు ప్రదర్శించిన రోగికి అదే పదార్ధం మందుగా పనిచేస్తుంది. ఈ సూత్రానికి ఉష్ణం ఉష్ణేత శీతలే అని సంస్కృతంలొ భాష్యం చెప్పొచ్చు. ఈ సిద్ధాంతాన్నే లేటిన్ భాషలో సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్ అంటారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి సింకోనా తింటే చలిజ్వరం లక్షణాలు కనిపించేయనుకుందాం. అప్పుడు చలిజ్వరంతో బాధ పడే రోగికి అతి చిన్న మోతాదులలో సింకోనా ఇస్తే రోగ లక్షణాలు ఉపశమించి, క్రమేపీ రోగం నయమవుతుందని సనాతన ¬మియోపతీ వాదిస్తుంది. అల్లోపతీ వైద్యంలో కూడ ఈ సూత్రం ఉంది. టీకాల మందులు దీనికి ఒక ఉదాహరణ. ఏ రోగం బారి నుండి తప్పించుకోవాలంటే ఆ రోగం లక్షణాలని శరీరంలో పుట్టిస్తుంది టీకాల మందు. కలరా, మసూచికం, పోలియో, టెటనస్, నుమోనియా, ఫ్లూ మొదలైన వాటికి ఎన్నిటికో టీకాల మందులు కనిపెట్టేరు.
పుప్పొడి పడని వాళ్ళకి కూడ టీకాల మందులు ఉన్నాయి. మలేరియా వంటి వ్యాధులకి కూడ టీకాల మందుల కోసం వేట సాగుతోంది. కనుక ఈ సూత్రంలో లోపం లేదు. కాని ప్రాయోగికమైన విషయాలలో బేధాభిప్రాయాలు ఉన్నాయి. ఉదాహరణకి, టీకాలు వేయించుకున్న వ్యక్తి రక్తం పరీక్ష చేసి చూస్తే టీకాల వల్ల శరీరంలో వచ్చిన మార్పు (ప్రతికాయాలు కనిపించటం) ఏమిటో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే టీకా మందు వల్ల శరీరం ఎలా స్పందిస్తుందో రక్తం పరీక్ష చేసి మనం రుజువు చూపించవచ్చు. హోమియోపతీ మందు వేసుకున్న తరువాత శరీరంలోని రక్తంలో కాని, జీవకణాలలో కాని ఎటువంటి మార్పు వస్తుందో ఇంతవరకు ఎవ్వరూ ప్రమాణాత్మకంగా రుజువు చేసి చూపించలేకపోయారు. మూడవ సూత్రం… ఇచ్చే మందు అతి సూక్షమమైన మోతాదులో ఇవ్వాలి. సాధారణంగా రోగి వేసుకొనే మూడు మాత్రలలో మందు ఒక పాలు ఉంటే పంచదార (కాకపోతే ఆల్కహాలు, కాకపోతే నీళ్ళు) పాళ్ళు ఉంటుంది. ఇంత తక్కువ మోతాదులో ఉన్న మందు ఎలా పని చేస్తుందో, దాని వెనక ఉన్న తర్కం ఏమిటో ఇంతవరకు ఎవ్వరూ నిక్కచ్చిగా రుజువు చేసి నిర్ద్వందంగా చెప్పలేకపోయారు.
ఇంగ్లీషులో ప్లసీబో అనే మాట ఉంది. లేటిన్లో ఈ మాటకి అలాగే! సంతోషిస్తాను అనే అర్ధం ఉంది. అలాగే వైద్య శాస్త్రంలో ఈ మందు గుణం చేస్తుంది అని చెప్పి వైద్యుడు పంచదార మాత్రలు ఇచ్చినా కొందరిలో గుణం కనిపిస్తుంది. ఈ దృగ్విషయాన్ని శాస్త్రీయ పద్దతిలో అనేక కోణాలనుండి రుజువు చేసేరు. ఈ సందర్భంలో ఔషధం లేని ఉత్త పంచదార మాత్రలని ప్లసీబో అంటారు. దీనిని తెలుగులో తధాస్తు మందు అనిన్నీ, ఈ ప్రభావాన్ని తధాస్తు ప్రభావం అనిన్నీ అనొచ్చు; ఎందుకంటే సంస్కృతంలో తధాస్తు అంటే అలాగే జరుగుతుంది అని ఆర్ధం కనుక. హోమియోపతీ వాడకంలో కనిపించే గుణం కేవలం తధాస్తు ప్రభావమే అని ఆధునిక శాస్త్రీయ దృక్పధపు వాదన. తధాస్తు ప్రభావం వల్ల కనిపించే గుణం ఉత్త ఊహాజనితమూ కాదు, మనస్సు మనని మభ్య పెట్టటమూ కాదు. ఈ ప్రభావం వల్ల వ్యాధి నిజంగా నయం అవుతుంది.
నమ్మకంతో తులసిదళంతో నూతినీళ్ళు తాగినా కొందరిలో గుణం కనిపిస్తుంది. అలాగని నూతినీళ్ళకి మహత్తు ఉందనడం శాస్త్రీయం అనిపించుకోదు. వచ్చిన చిక్కల్లా ఈ తధాస్తు ప్రభావం అందరిలోనూ కనిపించదు. ఈ దృగ్విషయం పరిపూర్ణంగా అర్ధం అయిననాడు హోమియోపతీ వైద్యం కూడా ఎలా పని చేస్తున్నాదో అర్ధం అవటానికి సావకాశాలు ఉన్నాయి. హోమియోపతీ శాస్త్రీయత లేని ఒక బూటకపు వైద్య పద్ధతి అనే ఆక్షేపణ ఒకటి బహుళ ప్రచారంలో ఉన్నప్పటికీ, హోమియోపతీ పద్ధతికి ప్రజలలో, కొన్ని పరిధులలో, ఆదరణ ఉంది. ఉదాహరణకి బడుగు దేశాలలోనూ, బీదవారిలోనూ ఉన్న ఆదరణ సంపన్న దేశాలలోనూ, సంపన్నులలోనూ లేదు. సంపన్న దేశాలలో కూడా మిగిలిన దేశాలతో పోల్చి చూస్తే అమెరికాలో ఆదరణ చాల తక్కువ.
ఇదే విధంగా విద్యాగంధం తక్కువ ఉన్న వారిలో ఉన్న ఆదరణ విద్యావంతులలో లేదు. విద్యావంతులలో కూడా ఆధునిక శాస్త్రంతో పరిచయం లేని వారిలో ఉన్న ఆదరణ శాస్త్రం తెలిసిన వారిలో లేదు. ఏది ఏమయినప్పటికీ, ఎన్ని ఆక్షేపణలు ఉన్నప్పటికీ, హోమియోపతీ వైద్యం రెండున్నర శతాబ్దాల కాలం నిలదొక్కుకోటానికి కారణాలు లేకపోలేదు. 1.హోమియోపతీ వైద్యం, మందులు (కనీసం భారత డేశంలో) బాగా చౌక – ఇంగ్లీషు మందులతోఈ పోల్చి చూసినా, ఆయుర్వేదం మందులతో పోల్చి చూసినా ఈ వైద్యం భారతదేశంలో చౌకే. కనుక బీద వారికి అందుబాటులో ఉన్న పద్ధతి ఇది. 2. సరి అయిన మందు వేసుకుంటే గుణం కనిపిస్తుంది. త్వరగా కనిపిస్తుంది.
చేసిన గుణం తాత్కాలికం కాకుండా శాశ్వతంగా ఉంటుంది. 3. హోమియోపతీ మందులు హాని చెయ్యవు. ఒక వేళ సరి అయిన మందు పడక పోతే గుణం కనిపించదు తప్ప, హాని ఉండదు. 4. హోమియోపతీ మందులు ప్రకృతిలో దొరికే పదార్ధాలతోటే తయారవుతాయి గాని కృత్రిమంగా సంధించబడ్డ రసాయనాలు కాదు. 5. హోమియోపతీ మందులు బాహ్య లక్షణాలని అదుపులో పెట్టటానికి ప్రయత్నించవు; బయటకి కనిపించే లక్షణాలకి మూల హేతువు ఏదో వాటి విూద పని చేస్తాయి. ఉదాహరణకి జ్వరం, దగ్గు మొదలయినవి బయటకి కనిపించే లక్షణాలు. ఈ లక్షణాలు పొడచూపగానే వాటిని వెంటనే అణచిపెట్టటానికి మందు వేసుకుంటే అసలు కారణం కప్పడిపోతుందని ఆధునిక వైద్య శాస్త్రం కూడా అంటుంది.
6. హోమియోపతీ పూర్ణదృక్పధ సిద్దాంతం. అంటే రోగిని ఒక రోగాల పుట్టలా కాకుండా ఒక వ్యక్తిగా చూసి, రోగికి ప్రస్పుటంగా కనిపించే బాహ్య లక్షణాలతో పాటు, రోగి మానసిక స్థితిని, మూర్తిత్వ వ్యక్తిత్వాలని సవిూక్షించి, రోగ లక్షణాలని కాకుండా రోగ కారణాలని దృష్టిలో పెట్టుకుని ఔషధ నిర్ణయం చెయ్యాలంటుంది. జలతారు పోగుల మధ్య నల్ల బట్ట ఉన్నట్లు, హోమియోపతీ సిద్ధాంతాలు చెప్పటానికీ, వినటానికీ బాగానే ఉంటాయి కాని, వీటిని ఆచరణలో పెట్టటంలో కొన్ని చిక్కులు ఉన్నాయి. రోగితో కనీసం గంటయినా గడపకుండా రోగ నిర్ణయం చేసి ఔషదాన్ని ఎంపిక చెయ్యటం కష్టం. సరి అయిన ఔషధం ఎంపిక చెయ్యక పోతే గుణం కనిపించదు.
హోమియోపతీలో తలనొప్పికి ఫలానా, జ్వరానికి ఫలానా అంటూ మందులు లేవు. తలనొప్పి ఎక్కడ వస్తున్నది, ఎప్పుడు వస్తున్నది, ఎప్పుడు ఉద్రేకం అవుతున్నది, ఎప్పుడు ఉపశమనం అవుతున్నది, రోగి మూర్తిత్వ వ్యక్తిత్వాలు ఏమిటి, వగయిరా ప్రశ్నలన్నిటికి సమాధానాలు రాబట్టాలంటే సమయం పడుతుంది.


