కేసీఆర్పట్ల కేంద్రానికి ప్రత్యేక గౌరవం: దత్తాత్రేయ
- 26 Views
- September 22, 2016
- జాతీయం
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (న్యూస్టైమ్): రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అందాల్సిన సహాయం, అమలు చేయాల్సిన కార్యక్రమాలపై చొరవ చూపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను కోరారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రజాప్రతినిధులంతా రాజకీయాలకతీతంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకుపోవడానికి కేంద్రం నుంచి అందాల్సిన పథకాలు, నిధులు, ఇతర సహాయం సకాలంలో రావాలని సీఎం అన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు, సహచర మంత్రులతో మాట్లాడి పెండింగ్లో ఉన్న పనుల విషయంలో తగిన చొరవ చూపాలన్నారు.
ఢిల్లీలోని దత్తాత్రేయ నివాసంలో సీఎం కేసీఆర్ గురువారం ఆయనను కలిశారు. మంత్రి చందూలాల్, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, డి.శ్రీనివాస్, లోక్సభ నాయకుడు జితేందర్రెడ్డి, ఎంపి వినోద్ కుమార్, ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు కేసీఆర్ వెంట ఉన్నారు. కేంద్రం నుంచి పెండింగ్లో ఉన్న పనుల జాబితాను సీఎం కేంద్రమంత్రి అందించారు. వెనకబడిన జిల్లాలకు అందాల్సిన రెండోవిడత ఆర్థిక సహాయం విడుదలయ్యేలా చూడాలన్నారు. రామగుండంలో ఫర్టిలైజర్ ప్లాంట్ పునరుద్ధరణకు ప్రధానమంత్రి స్వయంగా శంకుస్థాపన చేశారని, ఆ పనులు ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా కేంద్ర మంత్రులతో మాట్లాడి పెండింగ్ పనులు త్వరగా జరిగేలా చూస్తానని దత్తాత్రేయ హామీనిచ్చారు.
రాష్ట్రంపట్ల కేంద్రానికి సానుభూతి, ప్రేమ ఉన్నాయని, సీఎం కేసీఆర్పట్ల ప్రధాని సహా కేంద్రంలోని అందరికీ ప్రత్యేక అభిమానం, గౌరవం ఉన్నాయన్నారు. పార్లమెంట్లో తెలంగాణ ఎంపీల వ్యవహారశైలిపై ప్రభుత్వానికి, స్పీకర్కు సంతృప్తి ఉందన్నారు. దేశానికి సంబంధించిన విధానపరమైన చర్చల్లో తెలంగాణ ఎంపీలు క్రియాశీలక పాత్రపోషించడం అందరి మన్ననలు పొందిందని కేంద్రమంత్రి ప్రశంసించారు.


