‘హ్యాకింగ్’ గందరగోళం
- 22 Views
- admin
- May 13, 2017
- అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు
మాస్కో: ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సైబర్ దాడి జరిగింది. పలు దేశాల్లో శుక్రవారం గందరగోళం నెలకొంది. ఉన్నట్లుండి వేల సంఖ్యలో కంప్యూటర్లు హ్యాకింగ్కు గురయ్యాయి. దీంతో అత్యవసర సేవలు సైతం స్తంభించాల్సిన పరిస్థితి నెలకొంది. భారత్ సహా 74 దేశాల్లో ఒకేరోజు సైబర్ నేరగాళ్లు 45వేల హ్యాకింగ్లకు పాల్పడ్డారు. రష్యా రాజధాని మాస్కోలోని సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్స్కై ల్యాబ్ ఈ విషయాన్ని వెల్లడించింది.
తొలుత బ్రిటన్లోని పలు ఆసుపత్రులపై సైబర్ దాడి జరిగింది. ఐటీ వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కంప్యూటర్లు తిరిగి పనిచేయాలంటే డబ్బులు చెల్లించాలన్న సందేశం తెరలపై కనబడటంతో అధికారులు విస్తుపోయారు. ఏం జరిగిందా..? అని ఆరా తీశారు. ఇంతలోనే ఈ దాడి ప్రపంచమంతా పాకింది. ‘వానా క్రై రాన్సమ్వేర్’ ద్వారా కంప్యూటర్లను హ్యాక్ చేసినట్లు తెలిసింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 74 దేశాల్లో 45వేల సైబర్ దాడులు జరిగినట్లు కాస్పర్స్కై ల్యాబ్ తన బ్లాగ్లో పేర్కొంది. దీనిలో ఎక్కువగా రష్యాలోనే హ్యాకింగ్కు గురయ్యాయట.
మైక్రోసాఫ్ట్ విండోస్లో ఎస్ఎంబీవీ2 అనే రిమోట్కోడ్తో ‘వానా క్రై’ అనే రాన్సమ్వేర్తో హ్యాకర్లు దాడి చేసినట్లు తెలుస్తోంది. మొదట ఇంగ్లాండ్లోని నేషనల్ హెల్త్ సర్వీస్ సైబర్ దాడికి గురై.. చాలా ఆసుపత్రిల్లోని అత్యవసర సేవలు స్తంభించాయి. ఆ తర్వాత టర్కీ, వియత్నాం, ఫిలిప్పీన్స్, జపాన్, అమెరికా, చ్కెనా, స్పెయిన్, ఇటలీ, త్కెవాన్, రష్యాల్లోనూ సైబర్ దాడులు జరిగాయి. అన్ని దేశాల్లోనూ ఇదే రాన్సమ్వేర్తో హ్యాక్ చేసినట్లు తెలిసింది. కంప్యూటర్లను అన్లాక్ చేయాలంటే 300 డాలర్లు ఇవ్వాలన్న సందేశం కనిపించిందని న్యూయార్క్ ట్కెమ్స్ పేర్కొంది.
ఏపీలో 25 శాతం పోలీస్ శాఖలో హ్యాక్
ఈ మెయిల్ ద్వారా మాల్వేర్ను ఎన్క్రిప్టెడ్ ఫైల్లో పంపించారు. ఒకసారి డౌన్లోడ్ చేసిన వెంటనే కంప్యూటర్లు పనిచేయడం ఆగిపోయాయి. ప్రపంచ దేశాలతో భారత్లోనూ ఈ దాడులు జరిగాయి. దేశవ్యాప్తంగా పోలీస్ వ్యవస్థపై కూడా ఈ సైబర్ దాడి జరిగింది. పలు పోలీస్ స్టేషన్లలోని కంప్యూటర్లు హ్యాకింగ్కు గురయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని చిత్తూరు జిల్లాలో 8 పోలీస్ స్టేషన్లలోని కంప్యూటర్లు స్తంభించిపోయాయి. దీంతో విధులకు ఆటంకం కలిగింది. కంప్యూటర్లను డీకోడ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ దాడులు ఎవరు చేశారన్నది ఇంతవరకు అంతుచిక్కలేదు.