బ్రిక్స్ సదస్సులో భారత్.. చైనా
- 16 Views
- admin
- July 7, 2017
- Home Slider అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు
హాంబర్గ్: సిక్కిం సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితుల్లో ఇరు దేశాల నేతలు నేడు ఎదురుపడ్డారు. జర్మనీలో హాంబర్గ్లో ప్రారంభమైన జీ20 సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బ్రిక్స్ సమావేశాల్లో మోదీ, జిన్పింగ్లు ఎదురుపడ్డారు. అయితే ఈ సమావేశంలో భారత్పై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రశంసలు కురిపించడం గమనార్హం.
సిక్కిం వివాదం నేపథ్యంలో జీ 20 సదస్సులో మోదీ, జిన్పింగ్లు కలిసి పాల్గొనడంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. సదస్సుల్లో భాగంగా శుక్రవారం బ్రిక్స్ దేశాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మోదీ, జిన్పింగ్లు ఎదురుపడ్డారు. అయితే వీరిద్దరూ కలిసి మాట్లాడుకోలేదు కానీ.. ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. తొలుత మాట్లాడిన ప్రధాని మోదీ.. చైనా నాయకత్వంలో బ్రిక్స్ నిర్వహణను అభినందించారు. అంతేగాక, ఈ ఏడాది చివర్లో చైనాలోని జియామెన్లో నిర్వహించే బ్రిక్స్ సదస్సుకు భారత్ పూర్తి మద్దతిస్తుందని తెలిపారు. ఆ తర్వాత చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మాట్లాడుతూ.. ఉగ్రవాదంపై భారత్ పోరును ప్రశంసించారు. అంతేగాక.. ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధిని మెచ్చుకున్నారు. మున్ముందు కూడా మరింత వృద్ధి సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే సమావేశం అనంతరం ఇరుదేశాధినేతలు కరచాలనం చేసుకొని కాసేపు ముచ్చటించుకున్నారు.
హాంబర్గ్ వేదికగా జీ20 సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు మోదీ, జిన్పింగ్లతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, బ్రిటన్ ప్రధాని థెరిసా మే, జపాన్ ప్రధాని షింజో అబే, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్ తదితర ప్రపంచ నేతలు హాజరయ్యారు. వీరికి జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ సాదర స్వాగతం పలికారు.


