అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని గ్రామాలు దేశానికే ఆదర్శం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. నీరు-ప్రగతి పురోగతిపై ముఖ్యమంత్రి ఈరోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలీ కాన్ఫరెన్స్లో జిల్లాల కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి, కుటుంబాల ఆనందం, ఆరోగ్య జీవనం ప్రభుత్వ లక్ష్యాలు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సీజన్ మిస్ అయితే సంవత్సరం కోల్పోయినట్లే అన్న ఆయన.. అటు కాలాన్ని.. ఇటు నిధులను సద్వినియోగం చేసుకుని అనుకున్న ఫలితాలను సాధించాలన్నారు.అనంతపురం జిల్లాలో వర్షపాతం లోటు అధికంగా ఉందని.. ప్రత్యామ్నాయ పంటల సాగువైపు వెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆగస్టు 15లోగా వేరుశనగ నాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ క్రాపింగ్ 72శాతం పూర్తయిందని.. 100శాతం పూర్తిచేయాలని స్పష్టం చేశారు. పంట రుణాల పంపిణీ లక్ష్యం చేరుకోవాలని.. కౌలు రైతులకు రుణ పంపిణీ ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటికే 76శాతం రైతుల ఖాతాల్లో పడిందని.. మిగిలింది కూడా త్వరగా జమచేసి పెట్టుబడులకు రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.కూరగాయల సేద్యం, పండ్ల తోటల సాగును ప్రోత్సహించాలన్నారు.