రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు చేసిన రాజీనామాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమోదించే అవకాశాలున్నాయి. మరికొద్ది రోజుల్లో కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ, విస్తరణ జరగనుండడంతో ఆ సమయంలో ఈ శాఖను భర్తీ చేయనున్నారు. దానికి వీలుగా విస్తరణకు ముందే ప్రభు రాజీనామాను ప్రధాని ఆమోదించనున్నారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రైల్వే శాఖ పగ్గాలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నెల 25 నుంచి సెప్టెంబరు రెండో తేదీ మధ్య ఎప్పుడైనా కేబినెట్ విస్తరణ జరిగేందుకు అవకాశం ఉంది. మొత్తం 12 మంది మంత్రుల శాఖల్లో మార్పులు చోటు చేసుకోవచ్చని తెలుస్తోంది. రాజీవ్ ప్రతాప్రూడీ, చౌధరి బీరేంద్రసింగ్ల శాఖలను మార్చవచ్చనే సంకేతాలు వెలువడ్డాయి. ఉపేంద్ర కుష్వాహాను కేబినెట్ నుంచి తప్పించవచ్చని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం రక్షణ, పట్టణాభివృద్ధి, అటవీ-పర్యావరణ మంత్రిత్వ శాఖలను ఇతర మంత్రులు అదనపు బాధ్యత కింద చూస్తున్నారు. విస్తరణలో వీటికి పూర్తికాలపు మంత్రుల్ని నియమించనున్నారు. జేడీ(యు), ఏఐఏడీఎంకేలు ఇటీవలే ఎన్డీఏలో చేరిన దృష్ట్యా వాటికి ఒక్కో కేబినెట్ పదవి, ఒక్కో సహాయ మంత్రి పదవి అప్పగిస్తారని తెలిసింది. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కొందరు భాజపా ఎంపీలను కేబినెట్లో తీసుకోవచ్చు.