ముఖ్యమంత్రి మేనల్లుడు కారుపై దాడి
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ కాన్వాయ్పై త్రిపుర అగర్తల దాడి జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు.. డైమండ్ హర్బర్ టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ సోమవారం త్రిపుర అగర్తలలో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన కాన్వాయ్పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. బీజేపీ నేతలే కావాలని తనపై దాడి చేయించారని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. అభిషేక్ బెనర్జీ ప్రయాణిస్తున్న రోడ్డు పక్కన.. కొందరు వ్యక్తులు నిలుచుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం వీడియోలో కనిపిస్తుంది. వీరిలో కొందరి చేతిలో బీజేపీ జెండా ఉంది. కాన్వాయ్ అలా ముందుకు వెళ్తుండగా.. ఓ వ్యక్తి కర్రతో అభిషేక్ బెనర్జీ ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేశాడు. ఈ మేరకు అభిషేక్ బెనర్జీ ట్విటర్లో ‘‘బీజేపీ నాయకత్వంలోని త్రిపురలో ప్రజాస్వామ్యం ఇలా ఉంది. విప్లవ్ దేవ్ మీరు రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు.. మిమ్మల్ని అభినందిస్తున్నాను’’ అంటూ తన కాన్వాయ్పై జరిగిన దాడికి సంబంధించిన వీడియోని ట్విటర్లో పోస్ట్ చేశారు.


