రాజు ఆత్మహత్య చేసుకుంటాడని ముందే ఊహించారా ?
సైదాబాద్లో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం ఘటనలో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకుంటాడని పోలీసులు ముందే ఊహించారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సైదాబాద్లో చిన్నారిపై అఘాత్యానికి పాల్పడి ఆపై హత్య చేసిన రాజును చంపేయాల్సిందేనంటూ ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు కూడా రాజు కోసం తీవ్రస్థాయిలో గాలింపు చేపట్టారు. సెప్టెంబరు 9న ఘటన జరగ్గా, అప్పటినుంచి అతడి కోసం వేటాడారు. రాజుపై రూ.10 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు, ఆటోలు, బస్సులు, రైళ్లు, బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్ల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టారు. రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఉన్నాయని ముందే ఊహించిన పోలీసులు… రైలు కిందపడి చనిపోయిన వారి మృతదేహాలను కొన్నిరోజుల క్రితమే పరిశీలించారు. మార్చురీల్లో భద్రపరిచిన వారి శవాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బుధవారం రాజు ఉప్పల్లో సంచరించి నట్టు గుర్తించారు. చివరికి స్టేషన్ ఘన్పూర్ వద్ద రైలు పట్టాలపై చనిపోయి కనిపించాడు. పోలీసులు అనుమానించినట్టే రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చేతిపై మౌనిక అనే పచ్చబొట్టు ఆధారంగా అది రాజు మృతదేహమేనని గుర్తించారు. ఈ నేపథ్యంలో అన్ని వైపుల నుంచి చుట్టుముట్టడంతో రాజు ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు.


