ఆర్సీబీ ఫైనల్స్కు చేరడం పక్కా.. ఆధారాలివిగో అంటున్న ఫ్యాన్స్..!
పర్యావరణ పరిరక్షణ, పచ్చదనంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రతి యేటా ‘గో గ్రీన్’ నినాదంతో ఓ మ్యాచ్కు గ్రీన్ కలర్ జెర్సీలతో బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రంగు జెర్సీలు తమ ఆటగాళ్లకు అచ్చి రావట్లేదన్న సెంటిమెంట్ను ఆ జట్టు అభిమానులు బలంగా నమ్ముతారు. ఈ సీజన్కు ముందు వరకు ఆర్సీబీ గ్రీన్ జెర్సీల్లో ఆడిన 10 మ్యాచ్ల్లో ఏడింటిలో (2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020) ఓటమిపాలవ్వగా.. రెండు మ్యాచ్ల్లో (2011, 2016) విజయాలు, మరో మ్యాచ్ (2015) వర్షం కారణంగా రద్దైంది.
తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో గ్రీన్ కలర్ జెర్సీల్లో బరిలో దిగిన ఆర్సీబీ.. ఆరెంజ్ ఆర్మీని 67 పరుగుల తేడాతో చిత్తు చేసి సీజన్లో ఏడో విజయంతో ప్లే ఆఫ్స్ దిశగా దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలపై ఆ జట్టు అభిమానులు ఓ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. గతంలో తమ జట్టు గ్రీన్ కలర్ జెర్సీల్లో గెలిచిన సీజన్లలో ఫైనల్స్కు చేరిందని, దీంతో ఈ సీజన్లోనూ డుప్లెసిస్ సేన పక్కాగా ఫైనల్స్కు చేరుతుందని బల్ల గుద్ది చెబుతున్నారు. అంతే కాకుండా ఈ ఏడాది తమ జట్టు పాత ఆనవాయితీకి కూడా చరమగీతం పాడి టైటిల్ను ఎగురేసుకుపోతుందని ధీమాగా ఉన్నారు.
కాగా, ఆర్సీబీ తొలిసారి గ్రీన్ కలర్ జెర్సీల్లో బరిలోకి దిగిన 2011 సీజన్లో డేనియల్ వెటోరీ కెప్టెన్సీలో తొలిసారి ఫైనల్స్కు చేరింది. అయితే ఫైనల్స్లో సీఎస్కే చేతుల్లో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఆ తర్వాత 2016 సీజన్లోనూ విరాట్ కోహ్లి నేతృత్వంలో ఫైనల్స్కు చేరినప్పటికీ తుది సమరంలో సన్రైజర్స్ హైదరాబాద్ చేతుల్లో ఓటమిపాలైంది.


